Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంయుక్త కిసాన్ మోర్చా నిరసనలో టి. సాగర్, నంద్యాల నరసింహారెడ్డి
- జిల్లాల్లోనూ నిరసన కార్యక్రమాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశ భద్రతకు ముప్పు తెచ్చే అగ్నిపథ్ను రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, ఉపాధ్యక్షులు నంద్యాల నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ పిలుపులో భాగంగా హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర శుక్రవారం అగ్నిపథ్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ స్కీమ్ వల్ల దేశ భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని, కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే కేంద్రం దీన్ని తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఫిజికల్టెస్ట్, మెడికల్ టెస్ట్ పాసైన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి రిక్రూట్మెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. చివరి పరీక్ష కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేయడానికి పూనుకోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురయ్యారని తెలిపారు. ఫలితంగా అనేక చోట్ల ఆందోళనలు నిర్వహించారని, ఆందోళనకారులపై కాల్పులు జరిపి అభ్యర్థుల మరణానికి కేంద్ర ప్రభుత్వం కారణం అయిందని విమర్శించారు. మరణించిన అభ్యర్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, గాయపడిన వారికి పూర్తి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. దేశ భద్రతను తాకట్టు పెట్టే విధంగా నాలుగేండ్ల కాంట్రాక్టు పద్ధతిలో సైన్యంలో రిక్రూట్మెంట్ చేయడం దుర్మార్గమన్నారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఆందోళనకారులను ఎవరో ఎవరో ప్రేరిస్తున్నారని బీజేపీ నాయకులు మాట్లాడటం దుర్మార్గమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అనేక ఆందోళనలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ స్కీమ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన తరహాలోనే దీనిపైనా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ ఆందోళనలో దేశభక్తి యుత పౌరులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శంకర్, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్, గిరిజన సంఘం అధ్యక్షులు ఎం.ధర్మానాయక్, రైతు సంఘం సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, ఆవాజ్ రాష్ట్ర నాయకులు సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాల్లోనూ నిరసన ..
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద సీఐటీయూ రాష్ట్ర నాయకులు కిల్లే గోపాల్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రాములు, ప్రజా సంఘాల నాయకులు ధర్నా చేశారు. అంతకుమందు ఆర్టీసీ బస్టాండ్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీ చేశారు.
రక్షణ రంగంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ స్కీంను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నందబోయిన ఎల్లయ్య ఆధ్వర్యంలో ఆర్బిఎల్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు ప్రజ్ఞాపూర్లో రాణే బ్రేక్ లైనింగ్ పరిశ్రమ వద్ద నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా చేర్యాల పాత బస్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.
రైతు సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. చౌటుప్పల్ పట్టణకేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.