Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జక్కలొద్దిలో ఉన్న ప్రభుత్వ భూములను పేదల ఇండ్ల స్థలాలకోసం కేటాయించాల్సిందేనని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. పేదలపై పోలీసుల నిర్బంధం ఆపాలని కోరింది. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును శుక్రవారం హైదరాబాద్లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య నేతృత్వంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జి రాములు, జి జగదీశ్ కలిసి వినతిపత్రం సమర్పించారు. సర్కారు భూములంటే పేదలవనీ, అందులో ఇండ్లను వేసుకోవడం పేద ప్రజల హక్కనీ, దానిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జక్కలొద్దిలో ఉన్న 296 ఎకరాల్లో 246 ఎకరాలు అన్యాక్రాంతమైనా స్థానిక అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించిందని విమర్శించారు. మిగిలిన 50 ఎకరాల్లో పేదలు గుడిసెలు నిర్మించుకుంటే బుల్డోజర్లతో కూల్చివేయడం దుర్మార్గమన్నారు. దాదాపు 16 రోజులుగా గుడిసె లేక, నిలువ నీడలేక, ఎండనక, వాననక ప్రతిరోజూ ఐదు వేల మంది ఆ భూమి మీదకు వస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందేమోనని ఎదురుచూస్తున్నారని అన్నారు. ఇందుకు భిన్నంగా గుడిసెలు కూల్చివేసిన రోజు నుంచి పోలీసు యంత్రాంగం పేదలపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నదని విమర్శించారు. పోలీసులే స్వయంగా పేదలు ప్రయాణిస్తున్న ఆటోల అద్దాలు ధ్వంసం చేస్తున్నారని గుర్తు చేశారు. భారీ జరిమానాలు విధిస్తున్నారని చెప్పారు. కాలినడకన వస్తున్నవారిపైనా భౌతిక దాడులకు దిగుతున్నారని అన్నారు. చీటికి మాటికి అరెస్టులు చేస్తున్నారని వివరించారు. అక్కడే క్యాంపు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మంత్రి దృష్టికి తెచ్చామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని పేదలపై నిర్బంధ కాండను ఆపాలనీ, భూములను పేదలకు ఇండ్ల జాగాలకోసం పంచి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇంటి జాగా కోసం పోరాటం చేస్తున్న పేదలు గత 16 రోజులుగా ఎలాంటి గుడిసె వేయకుండా ఇప్పటి వరకు ఓపికగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. ఇండ్ల స్థలాలు సాధించుకునేవరకు సీపీఐ(ఎం) పోరాటాన్ని ముందుకు తీసుకుపోతుందని స్పష్టం చేశారు.