Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుజాత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వాలి : తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్
- పలు చోట్ల నిరసనలు
- అధికారుల వేధింపులపై ఆగ్రహం
నవతెలంగాణ- విలేకరులు
ఆశావర్కర్లపై పనిభారం తగ్గించాలని, హైదరాబాద్ శాలివాహననగర్ యూపీహెచ్సీ పరిధిలో పని ఒత్తిడి, అధికారుల వేధింపుల కారణంగా గుండెపోటుతో మరణించిన ఆశా వర్కర్ బి.సుజాత కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాల్లో ఆశావర్కర్లు ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు.గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ క్రాస్ రోడ్డు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. సుజాత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియోతోపాటు ముగ్గురు పిల్లలను ప్రభుత్వమే చదివించాలని నేతలు డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని కోరారు. ప్రతి శనివారం జూమ్ మీటింగ్ పెట్టి ఆశాలపై అధికారులు ఒత్తిడి పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. అధికారుల వేధింపుల కారణంగా అనేక మంది ఆశా వర్కర్లు రోగాల బారిన పడుతున్నారని, చిన్న వయస్సులోనే బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, మెడ నరాల నొప్పులు వంటివి వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం ఆశాలతో వెట్టిచాకిరి చేయిస్తోందని విమర్శించారు. ఆశాలకు పిక్స్డ్ వేతనం రూ.10వేలు ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం, జాబ్చార్ట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సంతోష్ నగర్ చౌరస్తాలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. దుండిగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా నిరసన వ్యక్తం చేశారు.వనపర్తి జిల్లా కేంద్రంలో రాజీవ్ చౌక్ వద్ద ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సునీత, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశాలు, నాయకులు నిరసన తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో ఆశాలు నిరసన తెలిపి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యాధికారి కార్యాలయం ఎదుట సీఐటీయూ జిల్లా కార్యదర్శి నర్సింహా ఆధ్వర్యంలో ఆశాలు నిరసన తెలిపారు. అనంతరం సూపరింటెండెంట్ రమేష్కు వినతిపత్రం అందజేశారు. ఆశా వర్కర్ సుజాత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని సీఐటీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. బోధన్లో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి వినతిపత్రం అందజేశారు. మోస్రా మండల కేంద్రంలో దిష్టిబొమ్మ దహనం చేశారు.