Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో 13 ప్రభుత్వ ఆస్పత్రులకు ఎన్క్వాష్ సర్టిఫికెట్లు
- నిర్మల్ ఏరియా దవాఖానాకు ''లక్ష్య'' గుర్తింపు
- హర్షం వ్యక్తం చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతం అయిందనీ, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని మరోసారి నిరూపితమైంది. రాష్ట్రంలోని మరో 13 ప్రభుత్వాస్పత్రులు ఎన్క్వాష్ (నేషనల్ క్వాలిటీ అష్యురెన్స్ స్టాండర్డ్స్-ఎన్క్యూఏఎస్) సర్టిఫికెట్లు సాధించాయి. మరో మూడు ఆస్పత్రులకు రీ సర్టిఫికేషన్ వచ్చింది. లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్ నిర్వహణలో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకు నిర్మల్ ఏరియా ఆస్పత్రికి ''లక్ష్య'' గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. వైద్యారోగ్య శాఖకు శుభాకాంక్షలు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులకు జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ హర్షం వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ వైద్య సేవల్లో నాణ్యత ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జాతీయ స్థాయి గుర్తింపు నిదర్శనమమని చెప్పారు.. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి నుంచి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. రాష్ట్ర వైద్యారోగ్య రంగం దేశానికే ఆదర్శంగా మారుతున్నదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కార్పొరేట్ ఆస్పత్రులకే పరిమితమైన జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాల గుర్తింపును రాష్ట్రంలోని జిల్లా, ప్రాంతీయ, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సాధిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు రావడానికి కారణమైన వైద్యారోగ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. తాజాగా వచ్చినవి కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం 143 ఆస్పత్రులకు ఎన్క్వాష్ గుర్తింపు వచ్చిందనీ, ఈ గుర్తింపు కలిగిన ఆస్పత్రులు అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. అన్ని ప్రభుత్వాస్పత్రులకు ఈ గుర్తింపు కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదనీ, ఆ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. దేశంలో మొదటి స్థానంలో నిలవడం లక్ష్యంగా పని చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ''స్వరాష్ట్రంలో ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని పటిష్టం చేస్తున్నది. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులు పెరిగాయి. విలువైన వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఓపీ, ఐపీ, సర్జికల్ ఇలా అన్ని విభాగాల్లో నాణ్యత పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రజలకు ఉచితంగా, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి.'' అని మంత్రి వివరించారు.