Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ సోమేష్కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 86 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా వాటి తీరు తెన్నులు ఎలా ఉండాలన్న దానిపై, మార్గదర్శకాల రూపకల్పనపై చర్చించారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టడీ సర్కిళ్లను జిల్లాకొకటి శాశ్వతంగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించి కూడా ఒక నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. నివేదికలు సిద్ధం అయ్యాక సీఎంతో జరిగే సమావేశంలో వీటిపై చర్చించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణంలో వంటశాలలు ఉండాలనీ, వంటవాళ్లకు కూడా సరైన శిక్షణ ఇచ్చేలా మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం, పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, మైనారిటీ సంక్షేమ కార్యదర్శి అహ్మద్ నదీమ్, బీసీ సంక్షేమ విద్యాలయ సంస్థ కార్యదర్శి మల్లయ్యభట్టుతో పాటు పలు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.