Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు బేడీలతో వేధిస్తారా?
- సీఎం కేసీఆర్కు రేవంత్రెడ్డి లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ప్రాజెక్టులు, పొలాలకు నీళ్ల పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు హద్దులు దాటుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి హెచ్చరించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు బేడీలు వేసి వేధిస్తారా? అని ప్రశ్నించారు. రైతుల పొలాల్లో నీళ్ల సంగతేమోగానీ వారి కండ్లలో మాత్రం కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. ప్రాజెక్టుల పేరుతో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రచారాలు చేసుకోవడం నాణేనికి ఒక వైపు మాత్రమేననీ, కానీ నాణేనికి రెండో వైపు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన గౌరవల్లి ప్రాజెక్టులో రీడిజైన్ ఫలితంగా ముంపు గ్రామాల సంఖ్య ఒకటి నుంచి ఎనిమిదికి పెరిగిందని గుర్తు చేశారు. ప్రారంభంలో ఒక్క గుడాటిపల్లి గ్రామం మాత్రమే ముంపునకు గురైందనీ, రీడిజైన్ ఫలితంగా తెనుగుపల్లి, మదెల్లపల్లి, సోమాజితండా, చింతల్తండా, పొత్తపల్లి, జాలుబాయి తండా, తిరుమల్ తండా మునిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఎకరం ధర రూ 20 లక్షల నుంచి 30 లక్షలకు తక్కువ లేదంటూ చెబుతున్న సర్కారు...గౌరవల్లి నిర్వాసితుల భూములకు మాత్రం ఆ ధర ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు. పునరావాసానికి సంబంధించి కొందరికి ఎకరాకు రూ. 2.10 లక్షలు, మరికొందరికి రూ.6.90 లక్షల పరిహారం అందించినట్టు అధికారులు చెబుతున్నారనీ, కానీ అన్ని కుటుంబాలకు పరిహారం అందలేదని పేర్కొన్నారు. సామాజిక సర్వేలో చాలా మంది తప్పిపోయారంటూ బాధితులు చెబుతున్నారని గుర్తుచేశారు.ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఎనిమిదేండ్లు పూర్తికావొస్తున్నా... 186 మందికి అసలు పరిహారమే అందలేదని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మైనర్లుగా ఉండి ఆ తర్వాత మేజర్లయిన వారిని కుటుంబంగా పరిగణించి ఒక్కొక్కరికి రూ.8లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ముంపు గ్రామాల్లో ఏండ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. భూములిచ్చి పరిహారమడిగితే వారిపై లాఠీచార్జి చేయడమే కాకుండా అత్యంత దౌర్జన్యంగా ప్రవర్తించారని తెలిపారు. రైతుల భూములు లాక్కుని... పరిహారం ఇవ్వకపోగా అరెస్టులు చేయడం, బేడీలు వేయడం గజ దొంగల్లాగా వారిని ట్రీట్ చేయడం అత్యంత ఆటవిక చర్య అని విమర్శించారు. గతంలో నిర్వాసితుల తరపున తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మంత్రి హరీశ్రావును కలిస్తే ఏవో మాటలు చెప్పారు తప్ప సమస్యను పరిష్కరించలేదన్నారు. గతంలో ఖమ్మంలో మిర్చీ రైతులకు సంకెళ్లు వేశారనీ, ఇప్పుడు గౌరవల్లి రైతులకు బేడీలు వేసి వారి ఉసురు పోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలనీ, రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు.