Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహితి సంస్ధ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఆనందాచారి
నవతెలంగాణ -హనుమకొండ చౌరస్తా
రాష్ట్రస్థాయి లిటరరీ ఫెస్ట్ను విజయవంతం చేయాలని తెలంగాణ సాహితి సంస్ధ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఆనందాచారి అన్నారు. తెలంగాణ సాహితి సంస్థ నిర్వహణలో త్వరలో హైదరాబాద్లో మూడు రోజుల పాటు జరిగే లిటరరీ ఫెస్ట్ను జయప్రదం చేయాలని ఆదివారం రాత్రి తెలంగాణ సాహితి ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండలోని కమిటీ కార్యాలయంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆనందాచారి హాజరై మాట్లాడారు. ప్రజల్లో చైతన్యం నింపే శక్తి పాటకే ఉందన్నారు. అలాంటి పాటకు పట్టాభిషేకం చేయాలనే లక్ష్యంతో జానపద వాగ్గేయ సాహిత్యం, సినీసాహిత్యం పై ఆగస్టు మొదటి వారంలో రాష్ట్రస్థాయిలో లిటరరీ ఫెస్ట్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా జానపద వాగ్గేయకారుల నుంచి పాటలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. సినీ సాహిత్యంపై విశ్లేషణాత్మక వ్యాసాలను ఆహ్వానిస్తున్నామన్నారు. వీటితో పుస్తకాలను ప్రచురించనున్నట్టు తెలిపారు. ఆసక్తిగల రచయితలు తమ పాటలు, వ్యాసాలను తెలంగాణ సాహితి ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ వారి వాట్సాప్ నంబర్లు 9182402209, 8977336447కు పంపించాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వాగ్గేయకారులు, సినీగీత రచయితలు, కవులు, సాహిత్యాభిమానులు రాష్ట్రస్థాయి లిటరరీ ఫెస్ట్లో పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. సన్నాహక సమావేశంలో తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అనంతోజు మోహన్ కృష్ణ, ప్రముఖ సాహితీవేత్తలు పల్లేరు వీరస్వామి, నల్లెల రాజయ్య నవ తెలంగాణ బుక్ హౌస్ మేనేజర్ బండారి బాబు, ఉమ్మడి జిల్లా కన్వీనర్ కోగిల చంద్రమౌళి, కార్యవర్గ సభ్యులు కార్తీక రాజు, కాసుల రవికుమార్, మేకిరి దామోదర్, శంకర్ నారాయణ, గుండు కరుణాకర్, కవులు కళాకారులు యోచన, రెలారే విజరు, మ్యాదరి సునీల్, తాడిచెర్ల రవి, ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.