Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుబంధు కింద రూ.57,956 కోట్లు జమ
- ఏ కారణంగా మరణించినా రైతు బీమా రూ.5 లక్షలు
- వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసిన సర్కారు
- ధాన్యపు రాసులతో రైతుల లోగిళ్ళు కళకళ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నది. నాణ్యమైన ఉచిత విద్యుత్తును 24 గంటల పాటు వ్యవసాయానికి అందిస్తున్నది. బీడు బారిన వ్యవసాయ భూమి ప్రభుత్వము కల్పించిన సాగునీటి వసతితో సస్యశ్యామలంగా మారింది. వ్యవసాయ రంగంపై ఆదారపడి బతికే రైతుకు ఆర్థిక వెసులుబాటు కోసం, పంట అభివృద్ధికి, పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందజేస్తున్నది. అనేక నూతన వ్యవసాయ పద్థతులు, విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి వ్యవసాయంలో అధిక దిగుబడి కోసం చర్యలు చేపట్టింది ఉద్యమ సమయంలో ఊరు, వాడ, పల్లె, పట్నం జిల్లాలో విస్తృతంగా పర్యటించిన సీఎం కేసీఆర్... రైతుల సమస్యలు స్వయంగా చూశారు. రైతుల బాధలు ఆకళింపు చేసుకున్నారు. 2014 జూన్లో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వ సారధిగా అభివృద్ధి సంక్షేమంపై ఉన్న అవగాహనతో సమగ్ర ప్రణాళిక రూపొందించి దశల వారీగా ఒక్కొక్క సమస్యను పరిష్కరించుటకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే రైతులు, వ్యవసాయరంగం సమస్యలపై దృష్టి సారించారు. దేశానికే వెన్నెముక్క అయిన రైతన్నకు అండగా నిలువాలని ముందుగానే వ్యూహన్ని రూపొందించారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దాలని తలపెట్టారు. మొదటి ప్రభుత్వ హయాంలోనే రైతులను ఆర్థికంగా ఆదుకొనుటకు 41.46 లక్షల మంది రైతులకు చెందిన 22 వేల కోట్ల వ్యవసాయ రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. గతంలోని నీటి పన్ను బకాయిలను రద్దు చేయటమే కాకుండా, సాగునీటి పన్నును శాశ్వతంగా రద్దు చేసిన ఘనత దేశంలో మన రాష్ట్రానికే దక్కింది. రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేసింది. కోటి ఎకరాలకు పైగా సాగునీరిచ్చినది. తెలంగాణ సాగు విస్తీర్ణాన్ని 2 కోట్ల 16 లక్షల ఎకరాలకు పెంచారు. ఆధునిక సేద్య పద్ధతులు, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులను అందుబాటులో ఉంచుట వలన పంట ఉత్పత్తి, ఉత్పదకతను అనేక రెట్లు పెంచింది. రైతు సంక్షేమంలో భాగంగా 27 లక్షల వ్యవసాయ మోటార్లకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నది. దీనికిగానూ ఏడాదికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టపరిచేందుకు ప్రభుత్వం రూ 36,179 కోట్లు ఖర్చు చేసింది. దేశంలో వినూత్న వరవడితో రైతుబంధు పథకం ప్రవేశపెట్టి రైతుకు పంట పెట్టుబడి సాయం చేస్తుంది. రైతుబంధు కింద 9 సీజన్లలో 65 లక్షల మంది రైతులకు రూ.57,956 కోట్లను ప్రభుత్వం అందజేసింది. రైతు మరణిస్తే అతని కుటుంబం వీధిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం రైతు బీమా పథకం ప్రవేశపెట్టింది. 100 శాతం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఒక గుంట భూమి ఉన్న రైతుకు కూడా ఆ పథకాన్ని వర్తింపజేస్తున్నది. రైతు మరణించిన పది రోజులలోపే ఆ కుటుంబాలకు ఎల్ఐసీ ద్వారా 5 లక్షల రూపాయలను రైతు ఇస్తున్నది. ఇప్పటివరకు 83 వేల 816 కుటుంబాలను రూ.4,161 కోట్లను అందించింది.నేడు రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రాజెక్టుల ద్వారా ఉచితంగా నీరు సరఫరా చేస్తున్నది. 2 కోట్ల పద్దెనిమిది లక్షల టన్నుల వరిధాన్యం ఉత్పత్తితో దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది. గత ఎనిమిదేండ్లలో వ్యవసాయ ఉత్పత్తి ఎనిమిది రెట్లు పెరిగింది. నేడు వరి ఉత్పత్తిలో పంజాబ్ రాష్ట్రంలో తెలంగాణ పోటీ పడుతున్నది. దేశంలోనే అత్యధికంగా ఏడు వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన మొత్తం వరి ధాన్యానికి మద్దతు ధరనిచ్చి కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నది. సకాలంలో ఎరువులు, విత్తనాలు రైతులకు అందిస్తుంది. దేశంలోనే తొలిసారిగా ఆన్లైన్లో విత్తనాల ధృవీకరణ చేస్తుంది. కల్తీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. కల్తీ వ్యాపారులపై పీడీ యాక్టు ప్రయోగిస్తున్నది. రాష్ట్రంలో గోడౌన్ల సామర్థ్యం 9.9 లక్షల టన్నుల నుంచి 31.9 లక్షల టన్నులకు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఐదు వేల ఎకరాల భూమిని ఒక క్లస్టర్గా విభజిస్తూ మొత్తం 2,601 క్లస్టర్లలో రూ. 57,288 లక్షల వ్యయంతో రైతు వేదికలను నిర్మించింది. ఆధునిక సేద్య పద్ధతులను క్షేత్ర స్థాయిలోకి తెచ్చి రైతులకు చేరువ చేసేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులకు 17 రకాల విధులను అప్పగించింది. వాణిజ్య పంటలు, కూరగాయలు వైపు రైతులను మళ్ళించుటకు వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నది. వ్యవసాయంలో అధిక దిగుబడి పొందేందుకుగానూ రైతులకు సలహాలు సూచనలు చేయటానికి విస్తరణాధికారులను నియమించింది. నూతన వ్యవసాయ పద్ధతులు, పథకాలతో వ్యవసాయం నేడొక లాభదాయక రంగంగా మారింది. నాణ్యమైన ఉచిత విద్యుత్త్, సాగునీరు, సకాలంలో ఎరువులు అందించి వ్యవసాయ రంగం పురోగతికి నిరంతరం కృషి చేస్తున్నది. రైతులు అధిక దిగుబడి పొంది ఆర్థికంగా ఎదుగుటకు దోహదం చేస్తుంది. నేడు దేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ మారుటకు రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది. తెలంగాణ రైతులు దేశంలోనే ధనిక రైతులుగా అభివృద్ధి చెందుతున్నారు. వ్యవసాయాభివద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో నేడు రైతుల లోగిళ్లు ధాన్యపురాసులతో కళ కళ లాడుతున్నాయని సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.