Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీరు జీవనాధారము, ప్రాణాధారం, నీరు మానవాళి మనుగడకు ఆధారం. నీరున్నచోటనే ప్రజా సమూహాలు ఆవాసం ఏర్పరచుకొన్నాయి. నాగరికత అభివద్ధి చెందింది. అందుకే మనిషి జీవనంతో జల వనరులు ముడిపడి ఉన్నాయి. రాజుల కాలంలో కేవలం వర్షపు నీటిని నిలువచేసి వివిధ అవసరాలకు వినియోగించుకొన్న దాఖలాలు అనేకం మనకు చరిత్రలో కనిపిస్తాయి. బావులు, చెరువుల తవ్వకం శాతవాహనులకు పూర్వం ఒక కార్యక్రమంగా ఉన్నప్పటికీ కాకతీయుల కాలంలో సాంకేతికతను జోడించి చెరువులను నిర్మించారు. ఈ ప్రక్రియ తదనంతరం కూడా కొనసాగింది. తెలంగాణ ప్రాంతం అంతటా కాకతీయులు, కుతుబ్ షాహీలు, ఆసిఫ్ జాహీలు నిర్మించిన చెరువుల స్ఫూర్తితో తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చిన్న నీటి వనరులను అభివద్ధి చేయాలని నిర్ణయించి, అందులో భాగంగా మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణ, పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ ప్రజలకు చెరువులు, బావులే ప్రదానాధారం. తెలంగాణ ప్రాంత భౌగోళిక స్వరూపం, వర్షపాతం విధానం చెరువుల ద్వారా నీరు నిలువ చేసి వ్యవసాయానికి వినియోగించుకొనే పద్ధతి ఆదర్శవంతంగా నిలిచింది. రాష్ట్రంలో చిన్న నీటి పారుదలకు 255 టీఎంసీల నీటిని కేటాయించి 25 లక్షల ఎకరాల ఆయుకట్టుకు నీరు అందించాల్సి ఉండగా అందులో కేవలం 9 నుండి 10 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేది. మిగిలిన 15 లక్షల ఎకరాలకు నీరు అందేది కాదు. చెరువులలో పూడిక పేరుకొనిపోయి నీటి నిలువ సామర్థ్యం తగ్గడం, తూములు శిథిలావస్థలో ఉండటం, చెరువు కట్టలు బలహీనపడటం, ఫీడర్ చానల్స్ పని చేయకపోవటం, కాలువలకు మరమ్మత్తులు లేకపోవటం వంటి కారణాల వలన చెరువులు, చిన్న నీటి వనరులు ఆశించిన రీతిలో నీటిని అందించలేదు. పైగా చాలా సంవత్సరాలు నిర్వహణ సరిగా లేకపోవడంతో పూడిక పేరుకొనిపోయింది. రాష్ట్రంలో 46,531 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిని దశలవారీగా పునరుద్దరించాలనే లక్ష్యంతో మిషన్ కాకతీయను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి సంవత్సరం 20 శాతం చెరువులను ఐదేండ్లలో మొత్తం చెరువులను పునరుద్దరించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు 2015 మార్చి12న మిషన్ కాకతీయను ప్రారంభించారు. ఐదు సంవత్సరాలు కొనసాగిన మిషన్ కాకతీయ వల్ల 27,665 చెరువులు పునరుద్ధరించటం జరిగింది. 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఇందుకోసం రూ.5,309 కోట్లు ఖర్చు చేశారు. 8.93 టీఎమ్సీల నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని పునరుద్దరించారు. చెరువుల కట్టలు బలోపేతం చేయటం వల్ల చెరువులు తెగటం తగ్గింది. అన్ని రకాల నీటి సంరక్షణ చర్యలు అనగా ప్రాజెక్టులు, చెక్ డ్యాంలు, చెరువుల పునరుద్దరణ వల్ల భూగర్భ జలమట్టం 4.14 మీటర్లకు పెరిగింది.
మిషన్ కాకతీయ వలన కలిగిన ప్రయోజనాలు
పూడిక తొలగింపు వలన భూగర్భ జలం రీఛార్జ్ సామర్థ్యం మెరుగుపడింది. ఫలితంగా చెరువు నీటి సామర్ధ్యం పెరిగింది. భూగర్భ జలంలో ఫ్లోరైడ్ తగ్గింది. పూడిక మట్టిని ఎరువుగా వినియోగించటం వలన ఎరువుల వాడకం తగ్గింది. పత్తి, మిరప మొదలగు పంటల దిగుబడి 20 నుండి 30 శాతానికి పెరిగింది. వరి దిగుబడి 19.60 శాతం పెరిగింది. 2,721 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని రైతులు తరలించుకొని ప్రభుత్వానికి రూ.1,088 కోట్లు ఖర్చు చేయకుండా పొదుపు చేయగలిగారు. 3,939 చెరువులలో 27 కోట్ల చేప పిల్లల్ని వదలటంతో 85 వేల టన్నుల చేపలు పెరిగి మత్స్యకారులకు 480 కోట్ల ఆదాయం 2016-17 లో సమకూరిందని తెలంగాణ రాష్ట్ర సమాచారం పౌరసంబంధాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.