Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టు కేసు కొట్టివేతతో మార్గం సుగమం
- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మెన్ వినోద్కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యోగాల క్రమబద్ధీకరణ ప్రక్రియ కోసం ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్కుమార్ చెప్పారు. శనివారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో కాంట్రాక్టు అధ్యాపకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016, ఫిబ్రవరి 26న కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ కోసం సీఎం కేసీఆర్ 16 జీవోను జారీ చేశారని గుర్తు చేశారు. కొంతమంది కోర్టును ఆశ్రయించడం వల్ల క్రమబద్ధీకరణ అంశం ఇంతకాలం కొలిక్కిరాలేదని అన్నారు. కోర్టు కేసు కొట్టివేతతో త్వరలోనే కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియకు మార్గం సుగమమవుతందని చెప్పారు. అయితే కింది కోర్టులో కేసు ఓడిన వ్యక్తులు సుప్రీం కోర్టును ఆశ్రయించారని ఆయన అన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత సానుకూలంగా ఉన్నారని వివరించారు.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ విషయం కోసం పలు సూచనలు, సలహాలను కాంట్రాక్టు అధ్యాపకుల నుంచి వినోద్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు సీఎం కేసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.
తెలంగాణకు నిటిఆయోగ్ ప్రశంస
రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందనీ, ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న నిటిఆయోగ్ పలు మార్లు ప్రశంసించిందని వినోద్ కుమార్ గుర్తు చేశారు. నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తుండటం, నీటి పారుదల సౌకర్యాలు పెంచడం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు భారీ ఎత్తున చేపట్టడం వంటి అనేక అంశాలున్నాయని ఆయన వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఉద్యమ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మక పాత్రను పోషిస్తున్నదని చెప్పారు. ఇప్పటికే ఒక లక్ష 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మరో 90 వేల ఉద్యోగాల భర్తీ కోసం దశల వారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తోందన్నారు. ఒకేసారి నోటిఫికేషన్లు జారీ చేస్తే అభ్యర్థులకు ఇబ్బందిగా ఉంటుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచం మెచ్చుకునే రీతిలో నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టు సహా పలు ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా లక్షలాది ఎకరాల భూములకు సాగునీరు చేరుతుందన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీనిచ్చారు. ఈ సమావేశంలో అధ్యాపక సంఘాల నాయకులు మాచర్ల రామకృష్ణగౌడ్, ఎం జంగయ్య, రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేష్, శ్రీనివాస్, వైకుంఠం, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.