Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, మరో రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్న క్రమంలో జిల్లాల్లో కలెక్టర్లంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసేలా పర్యవేక్షించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, చెరువుల వద్ద ప్రత్యేక సురక్షిత చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి కలెక్టరేట్లోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, భూపాల్ పల్లి, ములుగు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందనీ, ఆ జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే నిండిన అన్ని చెరువులు, కుంటల వద్ద ముందు జాగ్రత్తగా ఇసుక బస్తాలు ఏర్పాటు చేసుకోవాలనీ, లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా రోడ్లు దెబ్బతింటే వెంటనే పునరుద్దరించాలని తెలిపారు. గ్రామాల్లోని తాగునీటి ట్యాంకులను పరిశుభ్రం చేయాలనీ, అంటువ్యాధు లు ప్రబలకుండా తగు రసాయన పదార్థాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఇంధన శాఖ,మున్సిపల్ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్ శర్మ, అర్వింద్కుమార్ లతో పాటు అడిషనల్ డీజీ జితేందర్,పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్,మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ హనుమంత రావు, ఈఎన్సీ లు మురళీధర్,గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.