Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 జిల్లాలకు రెడ్ అలర్ట్
- భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం
- గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
- కరీంనగర్ జిల్లా గుండిలో 16.68 సెంటీమీటర్ల వర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదారాబాద్
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడింది. అది దక్షిణ ఒడిశా, సమీప ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దానికి అనుబంధంగా సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం నెలకొంది. ఉత్తర ద్వీపకల్ప భారతదేశం అంతటా వ్యాపించి ఎత్తుకు వెళ్లేకొద్దీ వంపు తిరిగి ఉంది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు ఎక్కువ ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. అదే సమయంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశముందని హెచ్చరించారు. ఆ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేశారు. రాష్ట్రంలోని 12 జిల్లాలు రెడ్ అలర్ట్ జాబితాలో ఉన్నాయి. రెడ్ అలర్ట్ జిల్లాలు : కొమ్రంభీమ్అసిఫాబాద్, మంచిర్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగాం . ఆరెంజ్ హెచ్చరిక : నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి