Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ వరదల నుంచి పరీవాహక ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ
- అత్యవసర సహాయం కోసం ఐదు జిల్లాలకు కోటి చొప్పున నిధుల విడుదల :హన్మకొండలో అధికారులు, ప్రజాప్రతినిధుల సమీక్షలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ - వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
గోదావరి నదిలో ప్రతిఏటా ఉధృతంగా ప్రవహించే భారీ వరదల నుంచి పరీవాహక ప్రాంత ప్రజలను శాశ్వతంగా రక్షించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం వుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. గోదావరి నది వరద పరీవాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించడంలో భాగంగా శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసిఆర్ అధికార యంత్రాంగంతో కలిసి హన్మకొండ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర జిల్లా ప్రజా ప్రతినిధులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గోదావరి నది, ఇతర ఉపనదుల వరద ప్రవాహం, కాంటూర్ లెవల్స్ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో వున్న కరకట్టలు వాటి నాణ్యత తదితర వివరాల గురించి ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. కడెం ప్రాజెక్టు వరద సామర్ద్యం 2.95 లక్షల క్యూసెక్కులు మాత్రమేనని, అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కడెం ప్రాజెక్టుకు ఐదు లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని సిఎం అన్నారు. భవిష్యత్తులో గోదావరి నదీ తీరంలో వరద వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా సమగ్రమైన సర్వే నిర్వహించి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం వున్నదని సిఎం అన్నారు. ఈ విషయంలో ఇంతకు ముందు ఇరిగేషన్ శాఖలో పనిచేసి రిటైరైన అనుభజ్ఞులైన ఇంజనీర్ల సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని సిఎం సూచించారు. గోదావరి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురై ఇబ్బంది పడుతున్న ప్రజలకు అన్నిరకాల సహాయ సదుపాయాలు కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, నిర్మల్, జిల్లాల కలెక్టర్లకు కోటి రుపాయల చొప్పున వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎం ఆర్థిక మంత్రి హరీశ్రావును ఆదేశించారు.
ప్రజలకు అవసరమైన మందులు, ఆహారం, అందిస్తూ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రిని ఆదేశించారు. ఇంకా కొన్నిరోజుల పాటు గోదావరిలో వరద ప్రవాహం కొనసాగే అవకాశం వున్నందున అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా వుండాలని సిఎం సూచించారు. ఆదివారం ఏరియల్ సర్వే అనంతరం ఏటూరు నాగారంలో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్టు సిఎం తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు పసునూరి దయాకర్, జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, మధుసూదనచారి, బస్వరాజ్ సారయ్య, రవీందర్ రావు, బండ ప్రకాష్, పొచంపల్లి శ్రీనివాసరెడ్డి, కౌశిక్ రెడ్డి, ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినరు భాస్కర్, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, నన్నపనేని నరెందర్, ఆరూరి రమేష్, వొడితెల సతీష్, రాజయ్య, శంకర్ నాయక్, పెద్ది సుదర్షన్ రెడ్డి, గండ్ర వెంకట్రమణా రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమష్ కుమార్, డిజీపి మహేందర్ రెడ్డి, సిఎం సెక్రటరీ స్మితాసభర్వాల్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, మేయర్ గుండు సుధారాణి, జిల్లా పరిషత్ చైర్మన్లు సుధీర్ కుమార్, గండ్ర జ్యోతి, చైర్మన్లు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, వై. సతీష్ రెడ్డి, సుందర్ రాజు, జీవి రామకష్ణ, వాసుదేవరెడ్డి, కలెక్టర్లు రాజీవ్ హనుమంతు, గోపి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, సదానందం, సారంగపాణి, హరిరమాదేవి, భరత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.