Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణపై కేంద్రానిది కక్షపూరిత వైఖరి...
తెలంగాణకు సంబంధించిన అనేకాంశాల్లో కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను, మన హక్కులనూ అది తొక్కిపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రం తరపున నిరసన గళం విప్పాలని ఆయన టీఆర్ఎస్ ఎంపీలకు సూచించారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను ప్రోత్సహించడం మాని, రాష్ట్ర అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం ద్వేషపూరితంగా వ్యవహరించడాన్ని ఎండగట్టాలని వారికి పిలుపునిచ్చారు.
- ఈ విధానాలపై పార్లమెంటులో గళమెత్తండి
- టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం
- కేంద్రానివి దివాళాకోరు విధానాలంటూ విమర్శ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీకి టీఆర్ఎస్ లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహంపై సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఎనిమిదేండ్ల కాలంలో రాష్ట్ర విభజన హామీలు సహా పలు హక్కులను తొక్కిపడుతున్న బీజేపీ అసంబద్ధ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో కలిసొచ్చే విపక్ష ఎంపీలతో సమన్వయం చేసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలని సూచించారు.
'కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల దేశం అన్నిరంగాల్లో వెనుకబడిపోతున్నది. ఈ క్రమంలో సోయున్న తెలంగాణ బిడ్డలుగా, భారత పౌరులుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉన్నది. అందుకు పార్లమెంటు ఉభయ సభలను సరైన వేదికలుగా మలుచుకోవాలి. ఆర్ధిక క్రమశిక్షణతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను మోడీ ప్రభుత్వం ఏనాడూ ప్రోత్సహించకపోగా, అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడుతున్నది. దేశంలోని 22 రాష్ట్రాల అప్పులు తెలంగాణకంటే ఎక్కువగా ఉన్నాయి. కానీ పరిధికి లోబడే మన ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలు నడుపుతున్నది. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్ల కాలంలో ఒక్క రోజు కూడా, ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాకుండా తిరిగి చెల్లించిన ట్రాక్ రికార్డు తెలంగాణ సొంతం. ఆర్.బి.ఐ. వేసే బిడ్లలో మన రాష్ట్రానికే ఎక్కువ డిమాండ్ పలుకుతున్న విషయం వాస్తవం కాదా...' అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా కేంద్రాన్ని ప్రశ్నించారు. పాలనలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న తెలంగాణ మీద ప్రధాని మోడీకి కన్నుకుట్టిందని, నిబంధనల పేరుతో ఆర్ధికంగా తెలంగాణను అణచివేయాలని చూడటం అత్యంత శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలు బీజేపీ సోషల్ మీడియా గ్రూపులకు ఎట్లా చేరుతున్నాయో చెప్పాలంటూ ఆ పార్టీ నాయకత్వాన్ని సీఎం ఈ సందర్భంగా ప్రశ్నించారు. దేశానికి, రాష్ట్రాలకు మధ్య గోప్యంగా ఉండాల్సిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా లీక్ చేసి, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్త చేశారు. ఇది కుట్ర పూరిత చర్య అని సీఎం స్పష్టం చేశారు. ఇదంతా ఒక పకడ్బందీ పథకం ప్రకారం చేస్తున్న బీజేపీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. తెలంగాణ పట్ల కేంద్ర బీజేపీ జాతీయ నాయకత్వం చౌకబారు రాజకీయాలను ఆశ్రయించడం దురకదృష్టకరమని కేసీఆర్ విమర్శించారు. ప్రతీయేటా ఎఫ్.ఆర్.బి.ఎం లిమిట్ను కేంద్రం ప్రకటిస్తుందని, ఆ తర్వాతే రాష్ట్రాలు కేంద్రం ప్రకటనపై ఆధారపడి వారి వారి బడ్జెట్లను రూపొందించుకుంటాయని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎఫ్.ఆర్.బి.ఎం లిమిట్ రూ.53,000 కోట్లు అని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తర్వాత మాట మార్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత అకస్మాత్తుగా, కక్షపూరితంగా రూ.53 వేల కోట్ల లిమిట్ను రూ.23,000 కోట్లకు కుదించడం కుట్ర కాదా? అని ప్రశ్నించారు. ఇలాంటి దివాళాకోరు, తెలివితక్కువ వ్యవహారాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీని నిలదీస్తూ, ఆ పార్టీ నగ స్వరూపాన్ని బట్టబయలు చేయాలని ఎంపీలకు స్పష్టం చేశారు. అందుకనుగుణంగా అన్ని రకాల ప్రజాస్వామిక పద్ధతులను అనుసరించాలని కేసీఆర్ తన పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం తమకు అయినవారికి అప్పనంగా దోచిపెట్టేందుకు రాష్ట్రాలమీద ఒత్తిడి తేవడంపై సీఎం మండిపడ్డారు. దీనిపై కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు సూచించారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచీ ప్రతిసారీ నిటి అయోగ్ ప్రశంసిస్తున్నదని, అత్యుత్తమ ప్రగతిని సాధిస్తున్న రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలంటూ పలుమార్లు ఆ సంస్థ వంటి సంస్థలను చేసిన సిఫారసులను ఉద్దేశపూర్వకంగా బుట్ట దాఖలు చేసిందని తెలిపారు. దీనిపై కూడా నిలదీయాలని ఎంపీలను ఆదేశించారు.