Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైభవంగా ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర
- తొలిబోనం, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి తలసాని
- అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు ొ నేడు 'రంగం'
నవతెలంగాణ-సిటీబ్యూరో/బేగంపేట
మహిళల కోలాటాలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పుల దరువులు, యువతీయువకుల నృత్యాల కోలాహలాలు, ఆనందోత్సవాల మధ్య సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం కన్నులపండువగా సాగింది. వేలాది మంది మహిళలు, సందర్శకులు అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వం తరపున తొలిబోనాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి సమర్పించారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయానికి వచ్చారు. ఆయనకు ఆలయ ఈవో గుత్తా మనోహార్ రెడ్డి, వేద పండితులు, అర్చకులు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు, కుటుంబ సభ్యులతో సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాధారణ సందర్శకులను అనుమతించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా మంత్రులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి సూరెపల్లి నంద, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, ముఠా గోపాల్, బేతి సుభాష్ రెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, సింగర్ మంగ్లీ అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా, అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమం జరగనుంది. రంగంలో స్వర్ణలత పచ్చికుండపై నిలుచుని భవిష్యవాణిని వినిపిస్తుంది. ఉదయం 9.30 గంటలకు అమ్మవారి గర్భగుడికి ఎదురుగా మాతంగేశ్వరీ దేవాలయం ఎదుట ఆమె భవిష్య వాణి వినిపించనుంది.