Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీపీఐ(యు) కార్యదర్శి గాదగోని రవి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు రైతులకు హక్కు పత్రాలివ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయని ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమస్యను పక్కదారి పటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని పేర్కొన్నారు. చట్ట ప్రకారం 2005కు పూర్వం దరఖాస్తు చేసుకున్న గిరిజన రైతులకు తక్షణం హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన ఫలితంగానే ఒక్క నెలలోనే సుమారు 3.95లక్షల దరఖాస్తులు సమర్పించారనీ, వాటిని పరిశీలించి పట్టాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. తరతరాలుగా పోడు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్న గిరిజనులపై తీవ్ర నిర్భంధాన్ని ప్రభుత్వం ప్రయోగిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో పేదలపై ప్రభుత్వ దమనకాండను ఆపాలని డిమాండ్ చేశారు. లేదంటే గిరిజన ఉద్యమాలను తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.