Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోండి
- అర్హులందరికీ బూస్టర్ డోస్ ఇవ్వండి: మంత్రి టి.హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఒక్క కేసూ నమోదు కాని మంకీ పాక్స్ పట్ల అనవసరంగా ఆందోళన చెందొద్దని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు ప్రజలకు సూచించారు. మంకీ పాక్స్ లక్షణాలు, పరీక్షలు, గుర్తింపు, చికిత్స తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు డీఎంఈ, టీవీవీపీ వైద్యులతో మంత్రి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో 12 వేల వరకు మంకీపాక్స్ కేసులు నమోదుకాగా, మన దేశంలో కేరళలో ఒక్క కేసు మాత్రమే వచ్చిందని చెప్పారు. తెలంగాణలో అనుమానిత లక్షణాలున్న వారు ఒక్కరు కూడా లేరని తెలిపారు. మంకీపాక్స్ విషయంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తంగా ఉందని హరీశ్ రావు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మార్గదర్శకాలను పాటిస్తున్నామనీ, గాంధీ ఆస్పత్రిలో రోగ నిర్ధారణ కేంద్రాన్ని, తక్షణ చికిత్స కోసం నోడల్ ఆస్పత్రిగా ఫీవర్ ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించినట్టు మంత్రి చెప్పారు. గాంధీలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడం, అనంతరం పాజిటివ్ వస్తె నిర్ధారణ కోసం నమూనాలను పుణెలోని ల్యాబ్కు పంపనున్నట్లు తెలిపారు. మంకీ పాక్స్ లక్షణాలు, పరీక్షలు, చికిత్స విధానం పట్ల వైద్యులందరు అవగాహన పెంచుకోవాలని, క్షేత్ర స్థాయి సిబ్బందికి వివరించాలని మంత్రి సూచించారు. వైరస్కు సంబంధించిన అనుమానిత లక్షణాలు గుర్తించిన వెంటనే బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. మంకీపాక్స్ నమోదైన దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు ఐసొలేషన్లో ఉండాలనీ, అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి ప్రాథమిక పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు. సీజనల్ వ్యాధులు, మంకీ పాక్స్, వ్యాక్సినేషన్, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య వివరాలు, సలహాలు కోసం 040-24651119, 9030227324 సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
వర్షాలు, వరదల కారణంగా సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందనీ, రాబోయే వారం పది రోజులు అన్ని ఆస్పత్రుల్లో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే ఓపి సమయాన్ని పెంచి ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు. అన్ని ఆసుపత్రుల్లో సూపరిండెంట్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చిన్న చిన్న సమస్యలను తక్షణం పరిష్కరించుకోవాలని ఆదేశించారు. తెలంగాణ డయాగస్టిక్స్ సెంటర్లు 24 గంటలు పని చేయాలనీ ఫలితాలను వీలైనంత వేగంగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పద్దెనిమిదేండ్లు దాటి, రెండో డోసు వేసుకుని ఆరు నెలలు పూర్తయిన వారికి బూస్టర్ డోసు అందించాలని మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసు పట్ల ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుని వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.