Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్సీఏ లో అవినీతి రాజ్యమేలుతోంది
- కాసుల కక్కూర్తితో ప్రతిభకు పాతరేస్తున్నారు: అర్షద్
- మూడేళ్లగా ఆడిట్ రిపోర్టును దాచి పెడుతున్నారు: శివ్లాల్
- కోట్ల రూపాయాలను మాయం చేశారు: శేష్నారాయణ్
- అజర్పై ధ్వజమెత్తిన హెచ్సీఏ మాజీ కార్యవర్గ సభ్యులు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) పనితీరు, ప్రస్తుత హెచ్ సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ వివాదస్పద వ్యవహారశైలిపై ఆ సంఘం సీనియర్ క్లబ్ సెక్రటరీలు ధ్వజమెత్తారు. సోమవారం ఫతే మైదాన్ క్లబ్లో భారత జట్టు మాజీ క్రికెటర్లు అర్షద్ ఆయూబ్, శివ్లాల్ యాదవ్, హెచ్సీఏ మాజీ సెక్రటరీ శేష్నారాయణ్ కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెచ్సీఏ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, సంయుక్త కార్యదర్శి నరేష్ శర్మ, మాజీ కోశాధికారి దేవ్రాజ్, మాజీ ఈసీ మెంబర్ చిట్టి శ్రీధర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత అర్షద్ ఆయూబ్ మాట్లాడుతూ హెచ్సీఏను అజారుద్దీన భ్రష్ఠు పట్టించాడని, కాసుల కక్కూర్తితో ప్రతిభకు పాతరేస్తున్నాడని ఘాటైన విమర్శలు చేశారు. అపెక్స్ కౌన్సిల్, ఏజీఎం, హెచ్సీఏ రాజ్యాంగం దేనితోనూ సంబంధం లేకుండా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి నియంతలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. 'అజర్ చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్న వారిని, అతడు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల గురించి నిలదీస్తున్న వారిపై కక్షపూరిత చర్యలకు దిగుతున్నాడు. ఆ క్లబ్లను హెచ్సీఏ లీగ్ల్లో ఆడకుండా నిరోధించడం. క్లబ్లను గుర్తింపు రద్దు చేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడు' అని ఆరోపించారు.
ఎవరు నొరెత్తుకూడదా?
ప్రతిభ గల క్రికెటర్లకు అన్యాయం జరుగుతున్నా.. హెచ్సీఏ పాలన వ్యవహారాలు గాడి తప్పుతున్నా ఎవరు నొరెత్త కూడదు, ప్రశ్నించకూడదన్నట్టు అజారుద్దీన్ ప్రవర్తిస్తున్నాడని శివ్లాల్ మండిపడ్డారు. బీసీసీఐ నుంచి వస్తున్న నిధులకు లెక్కా పత్రం లేకుండా పోయిందని.. మూడేళ్లగా ఆడిట్ రిపోర్టును దాచి పెడుతున్నారని విమర్శించారు. 'గత మూడేళ్లలో హైదరాబాద్లో ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కానీ, ఐపీఎల్, రంజీ, ముస్తాక్ అలీ మ్యాచ్లకు కానీ ఆతిథ్యం ఇవ్వలేకపోవడానికి కారకులెవరో అజారుద్దీన్ సమాధానం చెప్పాలి. సెలక్షన్ కమిటీ సలహా మండలని రద్దు చేశావు. అసోసియేషన్తో సంబంధం లేకుండా జూనియర్ నుంచి సీనియర్ స్థాయి వరకు సొంత సెలక్షన్ కమిటీలను ఏర్పాటు చేసుకుని టాలెంట్కు కాకుండా కాసులకు ప్రాధాన్యమిస్తూ ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నారు. హెచ్సీఏతో సంబంధం లేని వ్యక్తులతో అసోసియేషన్ను నడిపిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దీనికి తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది' అని శివ్లాల్ అన్నారు.
వ్యాపారంగా మారిపోయింది..
అజారుద్దీన్ అధ్యక్షుడయ్యాక హెచ్సీఏలో జవాబుదారీతనం పోయి నియంతత్వం వచ్చిందని శేష్నారాయణ్ విమర్శించారు. 'అసోసియేషన్ అవినీతి, అక్రమాల కూపంగా మారిపోయింది. ఒక ప్యానెల్గా పోటీ చేసి ఎన్నికైన కార్యవర్గ సభ్యులే తర్వాత ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని రోడ్డెక్కారు. అపెక్స్ కౌన్సిల్ అభిప్రాయాలతో కూడా సంబంధం లేకుండా అంతా నా ఇష్టమంటూ వ్యవహరిస్తూ అసోసియేషన్ వివాదాలను సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. హెచ్సీఏ ప్రస్తుత పరిపాలకులపై సుప్రీం కోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసి కేవలం రోజువారి పాలన వ్యవహారాలకే పరిమితమవ్వమని చెప్పగా, ఆ మార్గదర్శకాలను కూడా పాటించకుండా సొంత ఎజెండాతో ముందుకెళ్తూ 'కంటెమ్ట్ ఆఫ్ కోర్టు' కూడా అధ్యక్షుడు పాల్పుడుతున్నాడు. అధునాతున జిమ్ ఏర్పాటు చేస్తామని రూ.2.11 కోట్లు కేటాయించారు. దానికి సంబంధించి ఇప్పటివరకు ఒక్క డంబుల్ కూడా రాలేదు. గడిచిన మూడేళ్లలో కోట్ల రూపాయాలను మాయం చేశారు. ఇటీవల బీసీసీఐ నుంచి వచ్చిన రూ.16 కోట్లను కూడా పక్కదారి పట్టించారు. బంతులు, క్రికెటర్ల జెర్సీలు, ట్రాక్స్, క్రికెట్ సామగ్రి కొనుగోలులో అవకతవకలకైతే హద్దే లేకుండా పోయింది. రంజీ, ముస్తాక్ అలీ మొదలు బీసీసీఐ ఏ టోర్నమెంట్ నిర్వహించినా నిబంధనలకు విరుద్ధంగా జెంబో బందాలను పంపుతున్నారు. సెంచరీలు కొట్టకపోయినా, వికెట్లు తీయ్యకపోయినా డబ్బులుంటే చాలు జట్టులో చోటు ఖాయమనేలా హెచ్సీఏను దిగజార్చారు. ప్రసుత్త కార్యవర్గం గడువు మరో నెల రోజుల్లో ముగుస్తుంది. సెప్టెంబరులో ఎన్నికలు నిర్వహించేలా సుప్రీం కోర్టు, బీసీసీఐని విన్నవించనున్నాం' అని శేష్నారాయణ్ చెప్పారు.