Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్మీతా సభర్వాల్ ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరాఫరాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్య మంత్రి కార్యాలయ కార్యదర్శి, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆదేశించారు. డబుల్ క్లోరినేషన్తోపాటు నీటి నాణ్యత పరీక్షల శాంపిల్ సైజ్ను పెంచాలని సూచించారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరాఫరా స్థితిపై చీఫ్ ఇంజినీర్లు, అన్ని జిల్లాల ఎస్.ఈలు, ఈఈలు, డీఈఈలతో ఎర్రమంజిల్లోని మిషన్భగీరథ ప్రధాన కార్యాలయంలో స్మితా సభర్వాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు, వాతావరణ మార్పులతో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నదనీ, స్వఛ్చత విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఇంజినీర్లకు సూచించారు. నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం నీటి శుద్ది కేంద్రాల్లోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని చెప్పారు. ఇక గ్రామాల్లో ఉన్న ఓహెచ్ఎస్ఆర్ల దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూడాలని స్పష్టం చేశారు. దీంతోపాటు ఇండ్లలో ఉన్న నల్లా కనెక్షన్ల దగ్గర కూడా నీళ్లు నిల్వ లేకుండా, పరిశుభ్రంగా ఉంచుకునేలా గ్రామస్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఇక ఇండ్లలో తాగునీటి సేకరణ, నిల్వకు ఉపయోగించే ప్లాస్టిక్ పైపులు, డ్రమ్ములను కూడా క్లీన్గా ఉంచుకునేలా గ్రామస్థులకు చైతన్యం కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా నీటి సంబంధిత వ్యాధులు ప్రబలకుండా సురక్షిత తాగునీటి సరాఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ కపాకర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజి నీర్లు వినోభాదేవి, శ్రీనివాస్, మధుబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.