Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5 విలీన గ్రామాలు తెలంగాణకు తిరిగివ్వాలి
- ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలి :
- మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలోని లక్షలాది మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, భద్రాచలం ముంపునకు బీజేపీనే కారణమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సరైన అధ్యయనం చేయాలని కోరారు.
ఖమ్మం నగరంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 1986లో 75.9 అడుగుల వరద వచ్చినా ఇంత ముంపు లేదని, ప్రస్తుతం 71.4 అడుగుల వరద వస్తేనే పెద్దఎత్తున ముంపు వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు 35 లక్షల క్యూసెక్కుల నీటికి సరిపడా నిర్మిస్తున్నారని, భవిష్యత్లో 50 లక్షల క్యూసెక్కులకు పెంచితే భద్రాచలం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పోలవరంను మూడు కొండల మధ్య నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. ఒక వైపు కాంక్రీట్ డ్యామ్, మరో వైపు కాపర్ డ్యామ్ నిర్మిస్తున్నారని, ప్రస్తుతం వరద ఎక్కువ ఉండటం వల్ల రెండువైపులా కాపర్ డ్యాంపై నిండుగా వరద పోతుందని చెప్పారు. భవిష్యత్తులో కాపర్ డ్యామ్ ఉన్నచోట కాంక్రీట్ డ్యామ్ నిర్మిస్తే భద్రాచలం మొత్తం మునగడం ఖాయమన్నారు. ఈ విషయంలో సిడబ్ల్యూసీ జోక్యం చేసుకోవాలని కోరారు. పోలవరం బ్యాక్ వాటర్పై అధ్యయనం కోసం కేంద్ర జల సంఘం నిపుణుల కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. వరద ముప్పు నుంచి శాశ్వతంగా తప్పించడానికి అవసరమయ్యే నిర్మాణాల కోసం భద్రాచలం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన బిల్లును ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే పెట్టాలని కేంద్రాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఐదు గ్రామాల ప్రజలు కూడా తెలంగాణలో ఉండేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఏడు మండలాలు ఆంధ్రలో కలపాలని 2014లో కేంద్రం తీర్మానించిందని గుర్తుచేశారు. దీంతో భద్రాచలం ముంపునకు గురవుతుందని, ఆదివాసీలకు నష్టమని, ఇది రాజ్యాంగ విరుద్ధమని సీఎం కేసీఆర్ కేంద్రానికి నాడు లేఖ రాశారని చెప్పారు. తెలంగాణ బంద్కు కూడా పిలుపునిచ్చారని గుర్తు చేశారు.వరదల శాశ్వత పరిష్కారానికి సీఎం కేసీఆర్ రూ.1000 కోట్లు ప్రకటించారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధికార యంత్రాంగం మొత్తం ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో ఉందని చెప్పారు. ఒక్కొక్క వరద బాధిత కుటుంబానికి 20 కేజీల బియ్యం, 5 కేజీల కందిపప్పు ఇస్తున్నామన్నారు. రూ.పది వేల తక్షణ ఆర్థిక సహాయం బాధితుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్, జడ్పీ చైర్మెన్ లింగాల కమల రాజ్, డీసిసీబీ చైర్మెన్ కూరాకుల నాగభూషణం, నగర మేయర్ పునుకొల్లు నీరజ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర్లు, వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పాల్గొన్నారు.