Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు
నవతెలంగాణ- జడ్చర్ల
ఆగస్టు 7, 8, 9 తేదీల్లో సంగారెడ్డిలో నిర్వహించే కేవీపీఎస్ రాష్ట్ర మూడో మహాసభలను విజయవంతం చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన కేవీపీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దళిత బంధు లబ్దిదారులను ఎమ్మెల్యేలు, మంత్రుల క్యాంప్ ఆఫీసుల్లో కాకుండా గ్రామాల్లో సభలు పెట్టి ఎంపికచేయాలన్నారు. కేరళ, ఢిల్లీ మాదిరిగా 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరారు. ఆగస్టులో నిర్వహించే రాష్ట్ర మహాసభలకు దళిత్ సోషణ్ ముక్తి మంచ్ అధ్యక్షులు, కేరళ దేవాదాయ శాఖ మంత్రి రాధాకృష్ణన్, జాతీయ నాయకులు బీవీ రాఘవులు, ఐఏఎస్ వీఆర్ఎస్ ఆకునూరి మురళి, సామాజిక సంఘాల నాయకులు తదితరులు హాజరవుతారని తెలిపారు. మహాసభలకు సామాజిక, ప్రజాసంఘాల నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు కావలి పరశురాం, మీసాల కురుమయ్య, జడ్చర్ల మండల కార్యదర్శి శంకర్, టౌన్ కార్యదర్శి నాగరాజు, నాయకులు రమేష్, సంతోష్, రాజశేఖర్్ తదితరులు పాల్గొన్నారు.