Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టుల నీటిమట్టాలు, విడుదలపై అలర్ట్గా ఉండాలి
- విద్యుత్ సౌకర్యానికి అంతరాయం కలుగొద్దు
- కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలనీ, ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఢిల్లీ నుంచి ఆయా శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదనష్టం నివారణ చర్యలు, అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎస్ పలు సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారులు సహయ పునరావాస కార్యక్రమాలలో పాల్గొనాలని ఆదేశించారు. వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఉస్మాన్ సాగర్ , హిమాయత్ సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున, జీహెచ్ఎంసీ, జలమండలి సిబ్బంది, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చెరువుల్లోకి వస్తున్న నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అవసరమైన పక్షంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండినందున చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. కాజ్వేలు, లోతట్టు ప్రాంతాలు, చెరువులకు పడే గండ్లు, విషయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. రహదారులు, వంతెనలు దెబ్బతిన్న ప్రాంతాల్లో, ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలనీ, ఆ ప్రాంతాలలో పౌర నష్టం జరగకుండా తగు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, పోలీస్ శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ జితేందర్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ వాటర్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ సంజరు జైన్, దక్షణ మండలం విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమా రెడ్డి, ఉత్తర మండలం విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ గోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.