Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు 8 నుంచి 22 వరకు నిర్వహణ : సీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఆగస్టు ఎనిమిదో తేదీ నుంచి 22 వరకు స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కోటి జాతీయ జెండాలను సిద్ధం చేశామనీ, ఇంటింటికీ మువ్వెన్నెల జెండాలను పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. ఈ వేడుకల విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలనీ, అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. శనివారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై సీఎస్ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. వేడుకల కోసం వేసిన ఉన్నత స్థాయి కమిటీ ఇప్పటికే రోజువారీ కార్యక్రమాలను రూపొందించిందని తెలిపారు. 8న జరిగే ప్రారంభోత్సవ సభకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు. దేశ సమైక్యతా, దేశ భక్తిని పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇంటింటికీ పంపిణీ చేసేందుకు కోటి జెండాలను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా అన్ని సినిమా థియేటర్లలో పాఠశాల విద్యార్థులకు జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించే చలన చిత్రాలను ఉచితంగా ప్రదర్శించనున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హౌంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా , ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, జీఏడీ పొలిటికల్ కార్యదర్శి శేషాద్రి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ బి.రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమరు కుమార్, టీఎస్ఐఐసీ ఎమ్డీ నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.