Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ కు పొదెం వీరయ్య వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలను తిరిగి భద్రాచలం రెవెన్యూ డివిజన్లో కలపాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ను ఆదివారం హైదరాబాద్ రాజ్ భవన్లో ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వీరయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. భద్రాచలం పట్టణంలో గోదావరి కరకట్ట పునర్నిర్మాణం ఎత్తు పెంచడం, కొల్లుగూడెం గుట్ట వరకు నిర్మించే అంశాలపై వినతి పత్రం ఇచ్చినట్టు తెలిపారు. ఐదో షెడ్యూల్ ప్రాంతమైన భద్రాచలంలో నేటికీ భద్రాచలం పట్టణంలో ఎన్నికలు లేకపోవడం వల్ల పాలన కుంటుపడుతున్న విషయాన్ని గవర్నర్ కు తెలిపినట్టు వీరయ్య చెప్పారు. గ్రామ పంచాయతీనా, మున్సిపాలిటీనా అనే అంశాన్ని నిర్ధారించి ఎన్నికలు నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.