Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తరలింపు ప్రతిపాదన తిరస్కరించిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
గోదావరిఖనిలోని కోల్మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ (సీఎంపీఎఫ్) ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్కు తరలించాలన్న ప్రతిపాదనను సీఎంపీఎఫ్ బోర్డు ఆఫ్ ట్రస్టీలు తిరస్కరించారు. ఈ మేరకు మంగళవారం మహారాష్ట్రలోని నాగ్పూర్లో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ జైన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ తరలింపు చేపట్టవద్దంటూ గతంలో సింగరేణి సీఎమ్డీ ఎన్ శ్రీధర్ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. పెద్దపల్లి, మంచిర్యాల్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని బొగ్గు గనుల్లో పనిచేస్తున్న 35వేల మంది ఉద్యోగులు, ఇక్కడే స్థిరపడిన సుమారు 50 వేల మంది విశ్రాంత ఉద్యోగులకు అందుబాటులో ఉన్న సీఎంపీఎఫ్ ఆఫీస్ను ఎట్టిపరిస్థితుల్లోనూ తరలించొద్దని ఆయన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు. కార్మిక సంఘాలు కూడా తరలింపును వ్యతిరేకించాయి. అయితే మంగళవారం నాగ్పూర్లో జరిగిన బోర్డు ఆఫ్ ట్రస్టీల సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు సింగరేణి తరఫున హాజరైన డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్ కార్యాలయం అక్కడే ఉంటే కలిగే లబ్ధి, తరలిస్తే వచ్చే ఇబ్బందులను ట్రస్టీలకు కూలంకషంగా వివరించారు. ఇదే విషయాన్ని సమావేశంలో పాల్లొన్న కేంద్ర కార్మిక సంఘాలు సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్ కూడా చెప్పాయి. దీనితో సీఎంపీఎఫ్ ప్రాంతీయ కార్యాలయాన్ని గోదావరిఖనిలోనేకొనసాగించాలని బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు నిర్ణయించారు. అలాగే బొగ్గు సంస్థల్లో పదవీ విరమణ పొందిన కార్మికులకు చెల్లించే పెన్షన్ నిధిని మరింత బలోపేతం చేసేందుకు దేశంలో ఉత్పత్తి అవుతున్న ప్రతి టన్ను బొగ్గుపై మరో ఐదు రూపాయలను పింఛన్ నిధికి జమ చేయాలని ట్రస్టీలందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రస్తుతం టన్ను బొగ్గుపై రూ.10 జమ చేస్తుండగా తాజా నిర్ణయంతో ఇకపై ఉత్పత్తి అవుతున్న టన్ను బొగ్గుపై రూ.15 జమ చేయనున్నారు. దీనివల్ల సంక్షోభంలో ఉన్న పింఛన్ నిధికి కొంత ఆర్థిక పరిపుష్టి చేకూరుతుంది. బోర్డు ఆఫ్ ట్రస్టీలు ఏకగ్రీవంగా అంగీకరించిన ఈ ప్రతిపాదనలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఇవి అమలులోకి వస్తాయి. బోర్డు ఆఫ్ ట్రస్టీల సమావేశంలో కోలిండియా చైర్మెన్ ప్రమోద్ ఆగర్వాల్, బొగ్గు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి నిరూపమ కొట్ట్రూ, కోలిండియా డైరెక్టర్ (పర్సనల్) వినరు రంజన్, డబ్ల్యు.సి.ఎల్. డైరెక్టర్ (పర్సనల్) సంజీవ్ కుమార్, జీఎం (పర్సనల్) నరేంద్ర కుమార్, కోలిండియా అనుబంధ సంస్థల డైరెక్టర్లు, సింగరేణి జీఎం (పర్సనల్) ఐఆర్, పీఎం ఎ.ఆనందరావు, సి.ఎం.పి.ఎఫ్. కమిషనర్ విజయ్ కుమార్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.