Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని శాఖలూ సమన్వయంతో పని చేయాలి
- నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష
- సెప్టెంబర్ 9న నిమజ్జనం
నవతెలంగాణ- సిటీబ్యూరో
ఈనెల 31 నుంచి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. గణేష్ ఉత్సవ నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో మంత్రి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో ప్రతి ఏటా నిర్వహించే గణేష్ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉన్నదని చెప్పారు. ప్రజలు, ఉత్సవాల నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులకూ గురికాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నాలుగు లక్షలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో లక్ష, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లక్ష చొప్పున మొత్తం 6 లక్షల విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. అత్యంత ఆదరణ కలిగిన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకొనేందుకు వచ్చే వారు ఇబ్బందులకు గురికాకుండా ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో బారికేడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈనెల 24వ తేదీన అధికారులతో కలిసి ఖైరతాబాద్ వినాయక మండపాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నట్టు మంత్రి తెలిపారు.
విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 25 పాండ్స్కు అదనంగా మరో 50 నిర్మించినట్టు తెలిపారు. విగ్రహాల ఊరేగింపు నిర్వహించే రహదారుల్లో అవసరమైన చోట్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపడతామన్నారు. విగ్రహాల నిమజ్జనం నిర్వహించే ప్రాంతాల్లో క్రేన్లు, లైటింగ్, జనరేటర్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ప్రతి మండపం వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది పారిశుధ్య పనులను నిర్వహిస్తారన్నారు. సెప్టెంబర్ 9వ తేదీన గణేష్ నిమజ్జనం సందర్భంగా 8వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది మూడు షిఫ్ట్లలో విధులు నిర్వహిస్తారని తెలిపారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలీసు సిబ్బందిని నిమయమించడంతో పాటు మఫ్టీ, షీటీమ్లను ఏర్పాటు చేస్తామన్నారు.
సమావేశంలో పాల్గొన్నవారు ముందుగా జాతీయ గీతాన్ని ఆలపించారు. హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్సీ ప్రభాకర్రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సునీల్శర్మ, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తా, అదనపు డీజీపీ జితేందర్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రెటరీ నీతూకుమారి ప్రసాద్, పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ అమరుకుమార్, టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారి రఘోత్తంరెడ్డి, కల్చరల్ డైరెక్టర్ హరికష్ణ, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు భగవంతరావు, రాఘవరెడ్డి, నిరంజన్రెడ్డి, సుదర్శన్, శీలం ప్రభాకర్ పాల్గొన్నారు.