Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త సచివాలయ పనుల పరిశీలన
- ఏకకాలంలో అన్ని పనులు జరగాలని సీఎం కేసీఆర్ ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నూతన సచివాలయ నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఇతర అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్లోని అన్ని విభాగాల పనులను అద్భుతంగా, సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కలియతిరిగి నిశితంగా పరిశీలించారు. తొలుత నిర్దేశించుకున్న డిజైన్ల ప్రకారం పనులు జరుగుతున్నాయా? అని మంత్రిని, అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఏకకాలంలో అన్ని పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆలస్యం కావద్దని స్పష్టం చేశారు. స్లాబుల నిర్మాణం, భవనంపై డోమ్ల ఏర్పాటు, ఇంటీరియర్ పనులతోపాటు ఫర్నీచర్ విషయంలోనూ నూతన మోడళ్లను ఎంపిక చేసుకోవాలని సీఎం సూచించారు. మంత్రుల ఛాంబర్లు, మీటింగ్ హాళ్లు, యాంటీ రూమ్ల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భవనం మధ్య భాగంలో సుమారు రెండు ఎకరాల ఖాళీ స్థలంతోపాటు, సచివాలయ ప్రాంగణంలో గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ పనులు అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రిల్స్ నిర్మాణ పనుల నాణ్యత గురించి సీఎం ఆరా తీశారు. రెడ్ స్టోన్, డ్రయినేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. విజిటర్ల లాంజ్ నిర్మాణ పనులు, సచివాలయ గోడ వెంట మట్టి ఫిల్లింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సెక్రటేరియట్కు వచ్చే విదేశీ ప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సందర్శకులకు సౌకర్యవంతంగా ఉండేలా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ జిల్లాల నుంచి సచివాలయానికి వచ్చే ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలకు సదుపాయాలు ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు, కార్యదర్శులు, ఆయా శాఖల సిబ్బంది సౌకర్యవంతంగా పనులు చేసుకునేందుకు వీలుగా ఛాంబర్ల నిర్మాణం చేపట్టాలన్నారు. పనులు జరుగుతున్న తీరుపై సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా సమీక్ష జరిపారు. పనులకు సంబంధించిన ఆల్బమ్ ను పరిశీలిస్తూ, ఒక్కో పని గురించి సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, చామకూర మల్లారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్రావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కె.పి.వివేకానంద, బేతి సుభాష్ రెడ్డి, ఎ.జీవన్ రెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ వేద సాయిచంద్, ఆర్అండ్బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఐ.గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.