Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ప్రభుత్వ తీరుతో వ్యవస్థపై నమ్మకంపోయింది
- ఎర్రకోట నుంచి మాటల చెప్పటం కాదు మహిళలపై గౌరవముంటే ఉత్తర్వుల్ని రద్దు చేయండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బిల్కిస్ బానో లైంగిక దాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడంపై రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించాలని ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి మోడీ మాటలు చెప్పటం కాదు.. మాటల్లో నిజాయితీ ఉంటే, మహిళలపై గౌరవముంటే గుజరాత్ ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి దోషులను తిరిగి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, జువైనల్ జస్టిస్ చట్టానికి సవరణలు చేసి రేపిస్టులకు బేయిల్ దొరకకుండా చేయాలనీ, వారికి ఉరి, జీవితకారాగార శిక్షలు విధించాలని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మంత్రి కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక లైంగిక దాడికి గురైన ఐదు నెలల గర్భిణి బిల్కిస్ బానో కేసులో దోషులను ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను దేశం మొత్తం సంబురంగా జరుపుకుంటున్న సందర్భంలో హేయమైన చర్యకు పాల్పడిన 11 మంది రేపిస్టులను విడుదల చేయడం బాధాకరమని పేర్కొన్నారు. గుజరాత్ ప్రభుత్వ చర్యతో వ్యవస్థల మీద నమ్మకం పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ తక్షణం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చట్టాల్లోని లొసుగులను అడ్డం పెట్టుకుని రేపిస్టులు తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన లైంగిక దాడి ఘటన విషయంలోనూ నిందితులు మైనర్ అన్న ఒకే ఒక్క కారణంతో కఠిన శిక్ష నుంచి తప్పించుకున్నారనీ, బెయిల్ పొందారని తెలిపారు. 18 ఏళ్లు కన్నా తక్కువ వయసు ఉన్నవాళ్లు లైంగికదాడికి పాల్పడితే మూడేండ్లకు మించి శిక్ష విధించే అవకాశం ప్రస్తుత చట్టాలతో లేదని పేర్కొన్నారు. సామూహిక లైంగిక దాడి లాంటి దుశ్చర్యలకు పాల్పడే మైనర్లను మేజర్లుగానే భావించి ఆ మేరకు కఠిన శిక్షలు విధించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. చిన్నతనం నుంచే పిల్లలకు సామాజిక అవగాహన, చైతన్యం కలిగించడంతో పాటు రేప్ లాంటి నేరాలకు పాల్పడితే చనిపోయేదాక జైలు శిక్ష, ఉరిశిక్ష విధిస్తారనే భయం ఉండేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు.