Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ : టీఎస్పీఎస్సీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ములుగులో ఉన్న అటవీ కాలేజీ పరిశోధన కేంద్రంలో 27 అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. రెండు ప్రొఫెసర్, నాలుగు అసోసియేట్ ప్రొఫెసర్, 21 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని వివరించారు. వచ్చేనెల ఆరు నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. వాటి సమర్పణకు అదేనెల 27వ తేదీ వరకు గడువుందని పేర్కొన్నారు. రిజిస్టర్ పోస్టు లేదా నేరుగా దరఖాస్తులను సమర్పించేందుకు వచ్చేనెల 30వ తేదీ వరకు అవకాశ ముందని సూచించారు. అర్హతలు, ఇతర వివరాలకు www. tspsc. gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.