Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ ఫోటోగ్రఫీ పోటీల విజేతలకు అవార్డుల ప్రదానం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
శాస్త్ర, సాంకేతిక పరంగా గణనీయమైన మార్పులు వచ్చినా, ఫోటోలకు ఉన్న ప్రాధాన్యత తగ్గలేదని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. చరిత్రను తెలియచేసే ఫోటోలను తిరిగి చూస్తే ఒక్కసారిగా మనసు తేలికై నూతనోత్తేజం కలుగుతుందని వ్యాఖ్యానించారు. గురువారం హైదరాబాద్లో అంతర్జాతీయ ఫోటోగ్రీఫీ దినోత్సవ విజేతల బహుమతుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులతో సమానంగా ప్రెస్ ఫోటోగ్రాఫర్లకు గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. ఫోటోగ్రాఫర్లు ఉత్సాహంగా వార్తా ఫోటో లను బందిస్తారని చెప్పారు. ఫోటోగ్రఫీ పోటీల విజేతలకు అందించే నగదు పారితోషికాన్ని పెంచాలని తలసాని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ వెయ్యి పదాలను ఒక్క ఫోటో తెలియచేస్తుందని అన్నారు. పలు ఫోటోలు ఎప్పటికీ మన మదిలో ఉంటాయనీ, దీనికి ఉదాహారణగా ఆఫ్రీకాలో ఆకలితో అలమటించే ఒక బాలిక, రాబందు ఫోటోను పేర్కొన్నారు. ఛాయా చిత్రాలకు భాషతో సంబంధం లేదనీ, ఫోటోలు అనేవి విశ్వజనీనమని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రదినో త్సవ వజ్రోత్సవాలలో భాగంగా పోరాట స్ఫూర్తిని కలిగించేందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 552 సినిమా హాళ్లలో ప్రదర్శించిన గాంధీ సినిమాను రికార్డు స్థాయిలో 22 .37 లక్షల మంది విద్యార్థులు తిలకించారని వెల్లడించారు.
ఫోటోలు రాష్ట్రాభివృద్ధిని తెలిపేలా ఉన్నాయి: అర్వింద్కుమార్
సమాచార శాఖ కమీషనర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ మాట్లాడుతూ సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ ఫోటోగ్రఫీ పోటీలకు వచ్చిన ఎంట్రీలు ఈ ఎనిమిదేండ్ల అభివద్ధి ప్రస్థానాన్ని తెలిపే విధంగా ఉన్నాయని అన్నారు. ఈ పోటీలకు వచ్చిన ఫోటోలను నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ప్రదర్శించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ, రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ అనిల్ కూర్మాచలం సైతం పాల్గొని మాట్లాడారు. పోటీలు ఐదు విభాగాల నిర్వ హించగా, 96 మంది ప్రెస్ ఫోటోగ్రాఫర్లు మొత్తం 1200లకు పైగా ఫోటో ఎంట్రీలను పంపారు. ఈ సందర్బంగా ఫోటో ప్రదర్శనను మంత్రి తలసాని ప్రారంభించారు. సీఎస్ సోమేశ్ కుమార్, ఎఫ్డీసీ చైర్మెన్ అనీల్ కూర్మాచలం వీక్షించారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, అదనపు డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, ఎఫ్డీసీ జేఎండీ కిషోర్బాబు, జాయింట్ డైరెక్టర్లు జగన్, శ్రీనివాస్, వెంకటరమణ, డీడీలు వెంకటేశ్వర్లు, రాజారెడ్డి, ఫోటో విభాగం ఏ.డి బీమల్దేవ్ తదితరులు పాల్గొనున్నారు.