Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
- జాతీయ సెమినార్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు అభినందనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మన రాష్ట్రంలో అమలవుతున్న పల్లెప్రగతి, సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా మారుతున్నాయని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. చండీఘర్లో ఇటీవల జరిగిన జాతీయ సెమినార్ లో ప్రధాన ఆకర్షణగా తెలంగాణ ప్రగతి నిలిచిందని చెప్పారు. జాతీయ సెమినార్లో పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్లో మంత్రి ఎర్రబెల్లిని కలిశారు. వారిని ఆయన అభినందించారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంజాబ్లోని చంఢఘీర్లో ఈ నెల 22,23 తేదీల్లో 'గ్రామ పంచాయతీల్లో స్థిరమైన అభివద్ధి లక్ష్యాల స్థానికీకరణ - స్వీయ నిర్మాణాత్మక మౌలిక సదుపాయాలు' అనే అంశంపై సెమినార్ నిర్వహించిన విషయం తెలిసిందే. మన రాష్ట్రం నుంచి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మెన్ జనార్దన్ రాథోడ్, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ఎంపీపీ గోవర్దన్ రెడ్డి, వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మరియాపురం సర్పంచ్ బాల్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా-కె గ్రామ సర్పంచ్ మీనాక్షి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపూర్ సర్పంచ్ లింగన్నగౌడ్, నిజామాబాద్ జిల్లా మార్తాడ్ సర్పంచ్ ధరణి, హన్మకొండ డీపీఓ జగదీశ్వర్ ప్రతినిధులుగా వెళ్లొచ్చారు. ఆ సెమినార్ వివరాలను సర్పంచ్ లింగన్నగౌడ్ మంత్రికి వివరించారు. తెలంగాణ ప్రజాప్రతినిధులమంతా పల్లె ప్రగతి పథకం, 15వ ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, వివిధ పథకాలు, ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకుంటున్న తీరును వివరించామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, నర్సరీలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు ఏర్పాటు చేసిన విధానాన్ని చెబితే అందరూ ఆశ్చర్యపోయారని చెప్పారు. కేంద్ర మంత్రి, పంజాబ్ పంచాయతీరాజ్ మంత్రి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తెలంగాణ పల్లెల అభివృద్ధిని అభినందిస్తూ ఆసక్తి కనబరిచారని తెలిపారు. ఇలాంటి పథకాలేవీ తమ రాష్ట్రాల్లో లేవని వారు తెలిపారని అన్నారు. కేంద్ర మంత్రి సైతం తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలంటూ సెమినార్లో సూచించారని తెలిపారు.