Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్కు వీహెచ్పీ, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో గణేశ్ ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షులు భగవంతరావు, వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు కోరారు. శుక్రవారం ఈ మేరకు రాజ్భవన్లో వారు గవర్నర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ నగరంలో వారం నుంచి జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నదున్నట్టుగా కేంద్రానికి నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రామరాజు మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో కేసీఆర్ పాలన కాకుండా ఎమ్ఐఎమ్ పాలన నడుస్తున్నదని విమర్శించారు. కావాలనే నగరంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అమాయకులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతరావు మాట్లాడుతూ.. వేలాది మంది పోలీసుల బందోబస్తు మధ్య మునావర్ షో అవసరమా? అని ప్రశ్నించారు. మతోన్మాద శక్తులు నగరాన్ని నాశనం చేస్తున్నాయని విమర్శించారు. ఇంత జరుగుతున్నా పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.