Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే పనిలో బీజేపీ: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ - చిట్యాలటౌన్
మునుగోడు ఉపఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తన నిజ స్వరూపాన్ని బయటపెడుతూ ప్రజల హక్కులను కాలరాస్తోందన్నారు. మంగళ వారం నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని బీఆర్ ఫంక్షన్ హాల్లో సీపీఐ(ఎం) నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీల సమావేశం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చే పనిలో ప్రధాని నరేంద్ర మోడీ నిమగమయ్యారని విమర్శించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల తీర్పులకి వ్యతిరేకంగా మోడీ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చడం మంచి పద్ధతి కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించి కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తోం దన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేందుకు పనిచేస్తోందన్నారు. పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి పోతే సంపదంతా వారి వద్దే కేంద్రీకృతమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దుర్మార్గమైన విధానాలను అనుసరిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలు, పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతా రాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి అయిలయ్య, కొండమడుగు నర్సింహ, డబ్బికార్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.