Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుండగుల దాడిలో దెబ్బతిన్న ఇండ్ల పరిశీలన
- పార్టీ నాయకులు, సానుభూతిపరుల ఇండ్లపై దాడికి ఖండన
- కేసులో ఇరికించారు : పోతినేని, నున్నా
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిని సీపీఐ(ఎం) జిల్లా ప్రతినిధి బృందం శనివారం సందర్శించింది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఎదురొచ్చి ఈ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. విధ్వంసకారుల దాడిలో దెబ్బతిన్న పార్టీ సానుభూతిపరులు, నాయకుల ఇండ్లను నేతలు పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. హత్య ఘటనతో సంబంధం లేని తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల ఇండ్లపై దాడుల చేయడాన్ని, హత్యోదంతాన్నీ ఖండించారు.
తెల్దారుపల్లిలో ఆగస్టు 15న జరిగిన హత్యతోపాటు.. ఆ ఘటనతో సంబంధం లేని వారి ఇండ్లపై కొందరు దాడి చేయడాన్ని సీపీఐ(ఎం) ఖండిస్తోందని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ నాయకులు, సానుభూతిపరుల ఇండ్లను ధ్వంసం చేయడంతో పాటు అసత్య ఆరోపణలు చేసి కేసులో ఇరికించారని తెలిపారు. కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేశారని చెప్పారు. గ్రామంలో సీపీఐ(ఎం) బలంగా ఉన్నప్పటికీ సంయమనం పాటించాలని కార్యకర్తలకు హితబోధ చేశామన్నారు. తమవైపు నుంచి గ్రామంలో ఎటువంటి సంఘటనా జరగకూడదని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించామన్నారు. గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా సహకరించాలని చెప్పామన్నారు. విధ్వంసకారుల దాడిలో ధ్వంసమైన పార్టీ నాయకులు, సానుభూతిపరుల ఇండ్లను పరిశీలించి బాధితులకు మనోధైర్యం కల్పించేందుకే గ్రామానికి వచ్చామన్నారు. హత్యోదంతానికి కారణమైనవారిపై చర్యలు తీసుకోవడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఘటన జరిగిన రోజు నుంచి చెబుతూనే ఉన్నామన్నారు. హత్య ఘటనను ఆసరా చేసుకుని తమ పార్టీని దెబ్బతీయాలని, తమ నాయకులు, కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీయాలని తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తు న్నామన్నారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొదలు, స్థానిక నాయకత్వంపైనా తప్పుడు ఆరోపణలు సరికాదన్నారు. భవిష్యత్లో ఇటువంటి ఘటనలు జరగకుండా గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. విధ్వంసకారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. పోలీసులకు సహకరించాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు సూచించారు. గతంలో గ్రామం ఎంత ప్రశాంతంగా.. ఐక్యంగా ఉందో దాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తామన్నారు.
సంయమనం పాటిస్తే దుష్ప్రచారమా..?
దుండగుల విధ్వంసంలో దెబ్బతిన్న ఇండ్ల యజమానులు, కుటుంబ సభ్యులను కొన్నిరోజుల కిందటే పరామర్శించాలని భావించామన్నారు. దీనిపై పోలీసుల అనుమతి కోరామని, వారి సూచన మేరకు ఇప్పటి వరకు ఆగామన్నారు. అయినప్పటికీ కొందరు పనికట్టుకుని దుష్ప్రచారం చేశారన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను గ్రామంలోకి రాకుండా స్థానికులు అడ్డుకున్నట్టు తప్పుడు ప్రచారం సాగించారన్నారు. సీపీఐ(ఎం) ప్రతినిధి బృందానికి గ్రామస్తుల నుంచి నేడు లభించిన స్వాగతంతో అవన్నీ దుష్ప్రచారాలేనని తేటతెల్లమైందన్నారు. తెల్దారుపల్లి మొదటి నుంచి కమ్యూనిస్టు గ్రామమని అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తమ్మినేని సుబ్బయ్య నాయకత్వంలో స్థానికులు జమీందార్లకు వ్యతిరేకంగా పోరు సల్పిన విషయాన్ని గుర్తు చేశారు. సీపీఐ(ఎం) కృషి ఫలితంగానే గ్రామస్తులు సంఘటితంగా ఉండి ఎర్రజెండా నీడన గ్రామాభివృద్ధి సాధించుకున్నట్టు చెప్పారు. బాధితులను పరామర్శించిన వారిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, పొన్నం వెంకటేశ్వర్లు, మాచర్ల భారతి, భూక్య వీరభద్రం, బుగ్గవీటి సరళ, కళ్యాణం వెంకటేశ్వరావు, వై.విక్రమ్, గ్రామ సర్పంచ్ సిద్దినేని కోటయ్య, మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ తదితరులు ఉన్నారు.