Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-ముషీరాబాద్
భూమి కోసం, భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలుగు ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీర వనిత చాకలి ఐలమ్మ అని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఐద్వా కార్యాలయంలో వీరనారి ఐలమ్మ ట్రస్ట్, ఐద్వా సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఐలమ్మ 37వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. భూములు కోల్పోయి ఆకలితో చావటం కంటే, పోరాడి చావటమే మేలు అని భావించిన ఐలమ్మ దొరలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసిందన్నారు. అటువంటి స్ఫూర్తితో మహిళల హక్కుల కోసం ఐద్వా అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. ఐలమ్మ ట్రస్ట్ చైర్పర్సన్ బుగ్గవీటి సరళ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐద్వా జాతీయ నాయకులు టి.జ్యోతి, రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి, నాయకులు కె.వి.ఆశాలత, బి.హైమావతి, ట్రస్ట్ సభ్యులు, అడ్వకేట్ ఇందిర తదితరులు పాల్గొన్నారు.