Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నాపురం సీఆర్పీఎఫ్ క్యాంపును సందర్శించిన
- డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్ సింగ్
- మావోయిస్టుల కదలికలపై నిఘా కట్టుదిట్టం చేశాం : డీజీపీ
నవతెలంగాణ-చర్ల
మావోయిస్టు ఇలాఖాగా ప్రాచుర్యం పొందిన చెన్నాపురం అడవుల్లో పోలీస్ బాస్లు కలియతిరిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం వద్ద ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్ క్యాంపు నిర్మాణం పూర్తి కావడంతో బుధవారం రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్ సింగ్ హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా చేరుకున్నారు. జిల్లా ఎస్పీ డా.వినీత్ డీజీపీలకు పుష్పగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం అధికారికంగా సీఆర్పీఎఫ్ క్యాంపును ప్రారంభించారు. అధికారులందరూ క్యాంప్ పరిసరాలు, వసతులను పరిశీలించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మావోయిస్టు వ్యవస్థ నిర్మూలన కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలను పటిష్టం చేసేందుకు గాను ప్రత్యేకంగా క్యాంపులను ఏర్పాటు చేసిందన్నారు. అందులో భాగంగా జిల్లాలోని చెన్నాపురం, పూసుగుప్ప, ఉంజుపల్లి, చెలిమల, తిప్పాపురం, కలివేరు క్యాంపులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగం, సీఆర్పీఎఫ్ బలగాల సమన్వయంతో ఛత్తీస్గఢ్- తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామన్నారు. అమాయకపు ఆదివాసీ గిరిజనులపై దుశ్చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టులు తెలంగాణలో ఆదరణ కోల్పోయారన్నారు. అనంతరం డీజీపీ కుల్దీప్ సింగ్ మాట్లాడుతూ.. మావోయిస్టులను నిర్మూలించడంలో తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల పోలీసుల పనితీరు ప్రశంసనీయమని కొనియాడారు. తదుపరి అక్కడున్న సిబ్బంది, అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ ఎస్.ఎస్ చతుర్వేది, సౌత్ జోన్ సీఆర్పీఎఫ్ అడిషనల్ డీజీపీ నలినీ ప్రభాత్, సదరన్ సెక్టార్ సీఆర్పీఎఫ్ ఐజీ మహేష్ చంద్ర లడ్డా, కుంట సీఆర్పీఎఫ్ డీఐజీ రాజీవ్ కుమార్ ఠాకూర్, డీఐజీ ఎస్.ఎన్ మిశ్రా, సీఆర్పీఎఫ్ కమాండెంట్లు ప్రశాంత్ ధర్, ప్రదుమాన్ కుమార్ సింగ్, బి.ఆర్ మండల్, సంజరు కుమార్ కొత్తగూడెం ఓఎస్డీ టి.సాయి మనోహర్, భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజులు పాల్గొన్నారు.