Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వాతావరణంలో సహజ పొరగా ఉండి ఓజోన్ పొర భూమిని కాపాడుతున్నదనీ, దాన్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి గుర్తుచేశారు. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాలుష్యరహిత పరిసరాలతో, జీవన వైవిధ్యంతో ప్రాణకోటి విలసిల్లాలన్నా, మానవులు సుఖశాంతులతో ప్రశాంతంగా బతకాలన్నా పర్యావరణ సమతుల్యంతోనే అది సాధ్యమవుతుందని తెలిపారు. భూమిపై జీవ పరిరక్షణకు అంతర్జాతీయ సహకారం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో చెట్లే కీలకపాత్ర పోషిస్తాయనీ, అందుకే సీఎం కేసీఆర్ హరితహారం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యాక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, ఓజోన్ పొరకు హాని కలిగించే వస్తువుల వాడకంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కాలుష్య నియంత్రణ మండలి, శాస్త్ర, సాంకేతిక మండలి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.