Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలి
- బీజేపీని అధికారానికి దూరం చేయాలి
- అదే కమ్యూనిస్టుల ప్రధాన లక్ష్యం : సీతారాం ఏచూరి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) లేకుంటే బీజేపీనే లేదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఈడీతో భయపెట్టి, బెదిరించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఆపార్టీ కూలదోస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈడీ లేకుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలే కూలిపోతాయన్నారు. ఈడీ ఇంకా తమదాకా రాలేదనీ, వచ్చినా ఆశ్చర్యపోయేదేం లేదని చెప్పారు. దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకికవాద, ప్రజాహక్కుల పరిరక్షణ జరగాలనీ, బీజేపీని అధికారానికి దూరం చేస్తేనే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎమ్బీ భవన్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1948 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 1949 జులై 11వ తేదీ వరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్ు (ఆర్ఎస్ఎస్)పై అప్పటి కేంద్ర హౌంశాఖ మంత్రి సర్దార్ వల్లభారు పటేల్ నిషేధాన్ని విధించారనీ, ఇప్పుడు ఆయన్ని తమ సొంత మనిషి అన్నట్టు బీజేపీ ప్రచారం చేసుకుంటూ చరిత్రను వక్రీకరిస్తున్నదని వివరించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ-ముస్లిం ఘర్షణగా మార్చి, ప్రజల్లో మతోన్మాద బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 1948లో నిజాం నవాబుతో పాటు కాశ్మీర్ రాజు హరిసింగ్ కూడా తమ దేశాలను భారతదేశంలో విలీనం చేయడాన్ని వ్యతిరేకించారని గుర్తుచేశారు. విచిత్రంగా బీజేపీ అధికారంలోకి వచ్చాక హరిసింగ్ జన్మదినాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించారనీ, ఇక్కడి నిజాం నవాబుకు మతం ముసుగు తొడిగి ప్రజల్ని విడగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. మతోన్మాద అజెండాతో చరిత్రను పునర్లిఖితం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 1946లో ప్రారంభమై, 18నెలలు సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మూడువేల గ్రామాలు, 16వేల చదరపు కిలోమీటర్ల భూమి నిజాం సర్కారు నుంచి విముక్తం అయ్యి, పేదలకు 10 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందని వివరించారు. హైదరాబాద్ సంస్థానాన్ని కమ్యూనిస్టులు ఆక్రమిస్తారనే భయంతో, నిజాం నవాబు ఇండియన్ యూనియన్లో లొంగిపోవడానికి అంగీకరిస్తేనే భారత సైన్యం ఇక్కడకు వచ్చిందని చెప్పారు. లొంగుబాటు పూర్తయ్యాక కూడా భారతసైన్యం 1951 వరకు ఇక్కడే ఉండి, భూస్వాముల్ని మళ్లీ ఇక్కడ పున్ణస్థాపన చేసి వెళ్లాయని గుర్తుచేశారు. 1950 మార్చి 27 నాటికి 4,482 మంది కమ్యూనిస్టులు జైళ్లలో ఉంటే, 57 మంది రజాకార్లు మాత్రమే జైళ్లలో ఉన్నారని తెలిపారు. వీరోచితమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని బీజేపీ ముస్లింలపై యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని అన్నారు. బీజేపీని గద్దె దింపితే, ఆయా రాష్ట్రాల్లోని అన్ని లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలు ప్రత్యామ్నాయంగా ఉంటాయని చెప్పారు. ఈ నెల 25న హర్యానాలో దేవీలాల్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే ర్యాలీకి వామపక్షపార్టీలను ఆహ్వానించారనీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ కూడా ఆహ్వానిస్తున్నారని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంపై వివరణ ఇచ్చారు. తాము మద్దతు ఇస్తే, ప్రజా సమస్యల పరిష్కారంలో ఏవో అద్భుతాలు జరుగుతాయనే భ్రమలు తమకేం లేవని స్పష్టం చేశారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీనే తమకు ప్రథమ శత్రువు అనీ, దాన్ని ఓడించడమే తమ ముందున్న తక్షణ రాజకీయ అవసరం అని తేల్చిచెప్పారు. సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు.