Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్కు కేటీఆర్ ధన్యవాదాలు
- అన్ని రకాల సహకారం అందిస్తామని మంత్రి హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సిరిసిల్ల పట్టుచీర ''రాజన్న సిరిపట్టు'' అంతర్జాతీయ వేదికలపైన అనేక మందిని ఆకర్షిస్తున్నది. సిరిసిల్ల జిల్లాలోని నేతన్నలు తయారుచేసిన ''రాజన్న సిరిపట్టు'' పట్టుచీరలు న్యూజిలాండ్కి చెందిన మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ చేతుల మీదుగా న్యూజిలాండ్లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో అవిష్కరించబడ్డాయి. రాజన్న సిరిపట్టు చీరలను ప్రారంభించిన న్యూజిలాండ్ మంత్రి ప్రియాంకకు రాష్ట్ర టెక్స్టైల్ శాఖ మంత్రి, కె.తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. సిరిసిల్లకు చెందిన నేతన్నల ఉత్పత్తులు ప్రపంచ వేదికలపైన ఆవిష్కారం కావడం అత్యంత సంతోషాన్ని ఇస్తున్నదని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. ప్రియాంక రాధాకృష్ణన్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ఆర్ఐ, బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజరు తదితరులను మంత్రి అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో ఒకప్పుడు సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల నేతన్నలు వినూత్నమైన ఉత్పత్తులతో ప్రపంచాన్ని ఆకర్షించే పరిస్థితికి చేరుకున్నారని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్ లాంటి నైపుణ్యం కలిగిన నేతన్నలు, వినూత్న ఉత్పత్తులను తయారు చేయడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే హరిప్రసాద్ లాంటి నేతన్నల నైపుణ్యం వలన సిరిసిల్ల కేంద్రంగా బతుకమ్మ చీరలతో పాటు అగ్గిపెట్టెలు ఇమిడే చీర, వివిధ కళాకృతులు, వివిధ పేర్లతో రూపొందించిన వినూత్నమైన చీరలను నేశారని తెలిపారు. సిరిసిల్ల రాజన్న సిరి పట్టుకు మంచి భవిష్యత్తు ఉండాలనీ, అందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని తెలిపారు. నాలుగేండ్ల కింద బతుకమ్మ చీరల తయారీని చూసేందుకు రాష్ట్రానికి వచ్చిన బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజరు సిరిసిల్లలోని నేతన్నలు, వారి నైపుణ్యం గురించి తెలుసుకోవడం జరిగింది. అప్పుడే సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ గురించి తెలుసుకుని, ఆయనతో పట్టుచీరలు తయారు చేయించి, అమెరికా, యూకే, న్యూజిలాండ్ వంటి ఆరు దేశాల్లోని తెలిసిన వారికి, సిరిసిల్ల పట్టుచీరలకు ఆర్డర్లు ఇప్పించారు. అయితే సిరిసిల్ల పట్టుచీరలకు ఒక బ్రాండ్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ''రాజన్న సిరిపట్టు''గా నామకరణం చేసి, న్యూజిలాండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ దేశ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్తో, 300 మంది ప్రవాస భారతీయుల సమక్షంలో ఈ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఆ తర్వాత సిరిసిల్ల పట్టుచీరలతో ఒక ఫ్యాషన్ షోను సైతం నిర్వహించారు. ''రాజన్న సిరిపట్టు'' పేరుతో సిరిసిల్ల పట్టు చీరలకు ప్రత్యేకంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలన్న తన ఆలోచనకు, అటు తెలంగాణ ప్రభుత్వంతో పాటు ప్రవాసీ మహిళల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని సునీత విజరు తెలిపారు. తొలుత నేతన్న హరిప్రసాద్ ఒక్కరితో మాత్రమే ప్రారంభమైన పట్టు చీరల ఉత్పత్తి, ప్రస్తుతం జిల్లాలో 40 మందికి పైగా నేత్నలకు ఉపాధి లభిస్తున్నదని ఆమె తెలిపారు. నేతన్నల ఉత్పత్తులను ముఖ్యంగా ''రాజన్న సిరిపట్టు'' పట్టు చీరలను తన చేతుల మీదుగా ప్రారంభించడం తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ తెలిపారు. వ్యక్తిగతంగా తనకు పట్టు చీరలంటే ఎంతో ఇష్టమనీ, తెలంగాణకు చెందిన బతుకమ్మ సంబరాల కోసం ప్రవాసీలు తనని ఆహ్వానించిన ప్రతిసారి వాటినే ధరిస్తాననీ, పట్టుచీరలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో సిరిసిల్లకు చెందిన ఒక పట్టుచీరను ధరించి బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న విషయం ట్విట్టర్ ద్వారా తెలుసుకొన్న కేటీఆర్, ఆయన్ను హైదరాబాద్లో ఒక సమావేశంలో కలిసిన సందర్భంగా ప్రస్తావించారని గుర్తు చేసుకున్నారు.