Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లౌకిక,ప్రజాస్వామ్య పార్టీలకు మద్దతు: తమ్మినేని
- దేశభక్తి పేరుతో మోడీ దోపిడీ
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బీజేపీ మతోన్మాద, అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడే ప్రగతి శీల, లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. దేశభక్తి పేరుతో మోడీ ప్రజలను సర్వం దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంచికంటి హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ - ముస్లిం ఘర్షణగా చిత్రీకరించి ప్రజల్లో మతోన్మాద బీజాలు నాటేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ తమ పార్టీకి ప్రథమ శత్రువని, దాన్ని ఓడించడమే తక్షణ రాజకీయ అవసరమని పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా వాటి బడ్జెట్ను దశలవారీగా తగ్గిస్తూ నష్టాల పేరుతో ప్రయివేటు వ్యక్తులకు ఉదారంగా అమ్మేస్తున్నారని అరోపించారు. రిజర్వేషన్ల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయని కేంద్ర మంత్రులు కుంటిసాకులు చెప్తుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రిజర్వేషన్ల వల్ల ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ దివాళా తీయలేదని స్పష్టం చేశారు. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయని తెలిపారు. కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తుందన్నారు. ఈ విధానాలను ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించి ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలని, ప్రయివేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు జరిపి నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి. సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బుగ్గవీటి సరళ, కళ్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్, వై విక్రమ్, భూక్య వీరభద్రం, బొంతు రాంబాబు, చింతల చెర్వు కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.