Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు సీఎస్ ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సంబం ధిత ఏర్పాట్లపై హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో సోమవారం ఆయన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈనెల 25 నుంచి అక్టోబర్ మూడు వరకు బతుకమ్మ పండగను నిర్వహిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో సద్దుల బతుకమ్మ పండుగ కోసం వచ్చే నెల మూడున ట్యాంక్బండ్ వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు.
బతుకమ్మ ఘాట్, ట్యాంక్ బండ్, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని సూచించారు. మహిళలు ఉత్సవాల్లో భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలనీ, బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా చూసేందుకు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. బతుకమ్మ పండగపై ఆకర్షణీయంగా రూపొందించిన డిజైన్లతో మెట్రో పిల్లర్లను అలంకరిం చాలని చెప్పారు. ఎల్బీ స్టేడియంతోపాటు నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని కోరారు. నిర్వహణ ఏర్పాట్లు కూడా ఘనంగా ఉండాలంటూ సీఎస్ ఈ సందర్భంగా ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, డీజీపీ మహేందదర్రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.