Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 గంటల్లో మరింత బలపడే అవకాశం
- రాష్ట్రానికి తేలికపాటి నుంచి మోస్తరు వర్షసూచన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఆవర్తనం వల్ల మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్య దిశగా ఒడిశా తీరంవైపు కదులుతూ వచ్చే 24 గంటల్లో బలపడే అవకాశముంది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, కొమ్రంభీం అసిఫాబాద్, నిర్మల్, రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరికను ఐఎమ్డీ జారీ చేసింది. ఆ జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశముంది. హైదరాబాద్ నగరంలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే సూచనలున్నాయి. రాష్ట్రంలో సోమవారం రాత్రి పదిగంటల వరకు 569 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా పడింది. 14 చోట్ల భారీ, 186 ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అత్యధికంగా 9.53 సెంటీమీటర్ల వర్షం కురిసింది.