Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్టోబర్ 1 నుంచి 9 వరకు వర్తింపు
- పాఠశాల విద్యాశాఖకు ఎస్సీఈఆర్టీ లేఖ
- నేడు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులను ఐదురోజులపాటు కుదించే అవకాశమున్నది. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈనెల 26 నుంచి వచ్చేనెల తొమ్మిది వరకు అంటే 14 రోజులపాటు దసరా సెలవులను ఇవ్వాలని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందులో మార్పులు చేయాలంటూ, దసరా సెలవులను తగ్గించాలంటూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేకు మంగళవారం రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణా మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ ఎం రాధారెడ్డి లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా పాఠశాలలకు జులైలో 11 నుంచి 16 వరకు అంటే ఆరు రోజులపాటు, ఈనెల 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఒకరోజు ప్రభుత్వం సెలవులను ప్రకటించిందని గుర్తు చేశారు. దీంతో అకడమిక్ క్యాలెండర్లో ప్రకటించిన విధంగా పనిదినాలు ఏడు రోజులు తగ్గాయని వివరించారు. అందుకే దసరా సెలవులను ఐదు రోజులపాటు కుదించాలని సూచించారు. అందుకు ఆమె రెండు సూచనలు చేశారు. దసరా సెలవులను అక్టోబర్ ఒకటి నుంచి తొమ్మిదో తేదీ వరకు ఇవ్వాలని కోరారు. లేదంటే ఈనెల 26 నుంచి వచ్చేనెల తొమ్మిదో తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించి, నవంబర్, డిసెంబర్, వచ్చేఏడాది ఫిబ్రవరి, మార్చిలో రెండో శనివారం పనిదినంగా ఉండాలని వివరించారు. అకడమిక్ క్యాలెండర్ను మార్చాలని కోరారు. అయితే దీనిపై పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వంతో సంప్రదించి బుధవారం దసరా సెలవులకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసే అవకాశమున్నది.