Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాయికోడ్ తహసీల్దార్ సస్పెండ్
- ఆర్ఐపై క్రమశిక్షణా చర్యలకు కలెక్టర్ సిఫారసు
నవతెలంగాణ-రాయికోడు
వృద్ధురాలు బతికుండగానే ఆమె పేరున ఉన్న భూమిని అక్రమంగా కాజేయాలని వేరొకరి పేరుతో పట్టా చేసిన తహసీల్దార్ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విచారణ అనంతరం తహసీల్దార్పై కలెక్టర్ వేటు వేశారు. రాయికోడ్ మండలం నాగన్పల్లికి చెందిన పట్లోళ్ల హన్మంత్రెడ్డికి సర్వేనంబర్ 198లో 27-34 ఎకరాల భూమి ఉంది. గతేడాది ఆయన మరణించగా, ఆ భూమిని ఆయన భార్య శివమ్మ పేరిట ఫౌతీ చేయించుకున్నారు. భర్త మరణించటంతో ఆమె హైదరాబాద్లోని కుమారుల వద్ద ఉంటుంది. దాంతో శివమ్మ బంధువులు ఆమె భూమిపై కన్నేశారు. శివమ్మ మరణించిందని, ఆ భూమిని తన పేరిట మార్చాలంటూ హన్మంత్రెడ్డి సోదరి శేరి అంజమ్మ స్లాట్బుక్ చేసుకుంది. శివమ్మ పేరున ఉన్న భూమి మార్చుకునేందుకు హన్మంత్రెడ్డి మరణ ధ్రువీకరణ పత్రాన్ని అధికారులకు సమర్పించింది. భర్త మరణ ధ్రువీకరణ పత్రం తీసుకుని బతికున్న భార్య పేరున ఉన్న భూమినంతా తహసీల్దార్ రాజయ్య, రెవెన్యూ అధికారులు ఈ నెల 19న అంజమ్మ పేరున మార్చేశారు. విషయం తెలుసుకున్న బాధితురాలు సంగారెడ్డి కలెక్టర్ను ఆశ్రయించి ఆధారాలు సమర్పించింది. అనంతరం అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్ రాజయ్యతో పాటు అంజమ్మపై బాధితురాలు శివమ్మ రాయికోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తహసీల్దార్ రాజయ్యపై రాయికోడ్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. భూమి మరొకరి పేరున పట్టా చేశారంటూ ముందుగా బాధితురాలు సంగారెడ్డి కలెక్టర్ శరత్ను ఆశ్రయించగా ఇప్పటికే చేసిన ప్రాథమిక విచారణలో తహసీల్దార్ నిర్వాకం బయటపడటంతో రాజయ్యను వెంటనే సస్పెండ్ చేశారు. గతంలో రాయికోడ్ ఆర్ఐగా పని చేసిన శ్రీకాంత్పై క్రమశిక్షణా చర్యలకు కలెక్టర్ సిఫారసు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక అందజేశారు.