Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7 వరకు వెబ్ఆప్షన్ల నమోదు
- 9న సీట్ల కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్డబ్ల్యూ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ వచ్చేనెల ఒకటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి శుక్రవారం షెడ్యూల్ను విడుదల చేశారు. వచ్చేనెల ఒకటి నుంచి ఏడో తేదీ వరకు రూ.400 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదేనెల ఒకటి నుంచి ఏడో తేదీ వరకు వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశముందని తెలిపారు. తొమ్మిదిన సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. వచ్చేనెల తొమ్మిది, పది తేదీల్లో ఆన్లైన్ ద్వారా సెల్ఫ్రిపోర్టింగ్ చేయాలని సూచించారు. 10, 11 తేదీల్లో కేటాయించిన కాలేజీల్లో విద్యార్థులు చేరాలని కోరారు. ఈనెల 26 నుంచి 28 వరకు ఇంట్రా కాలేజీ విడతలో విద్యార్థులు వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. 29న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.
డిగ్రీలో చేరే గడువు నేటి వరకు పొడిగింపు
రాష్ట్రంలో దోస్త్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు కేటాయించిన కాలేజీల్లో చేరే గడువును శనివారం వరకు పొడిగించినట్టు నవీన్ మిట్టల్, ఆర్ లింబాద్రి తెలిపారు. దోస్త్ మొదటి, రెండు, మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్రిపోర్టింగ్ చేయడంతోపాటు కాలేజీల్లో రిపోర్టు చేసే గడువు శనివారం వరకు ఉందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు https://dost.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.