Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బకాయిపడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలి
- గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు గిరిజన హాస్టళ్ల వర్కర్ల ధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జీతాలిస్తారా? సమ్మె చేయమంటారా? అంటూ గిరిజన హస్టల్ వర్కర్లు నినదించారు. ఆరు నెల్లుగా బకాయిపడ్డ వేతనాలను చెల్లించాలంటూ, అందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీవేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె బ్రహ్మచారి అధ్యక్షతన జరిగిన ధర్నాలో తెలంగాణ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె వెంకటేశ్ మాట్లాడుతూ గిరిజన కార్మికుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకుంటూ , కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా పస్తులుంచుతున్నారని తెలిపారు. పర్మినెంట్ చేయడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నదో చెప్పాలని ప్రశ్నించారు.డైలీవేజ్ కార్మికులకు జిల్లా కలెక్టర్ల సర్క్యులర్ ప్రకారం వేతనాలు ఇవ్వాలనీ, ఔట్సోర్సింగ్ కార్మికులకు జీఓ నెం 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు మాట్లాడుతూ పీఎంహెచ్ హాస్టళ్లలో క్యాటరింగ్ పద్దతిని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.జీవో నెం527 ను రద్దు చేయాలని కోరారు. పార్ట్టైం విధానాన్ని రద్దు చేసి రోజు మొత్తం పనిచేస్తున్న వారికి పూర్తి వేతనం చెల్లించాలని కోరారు. సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో డీటీడీఓల ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
బకాయి వేతనాలు చెల్లిస్తాం..జేడీ హామీ..
వినతి పత్రం స్వీకరించిన జాయింట్ డైరెక్టర్ సైదులు త్వరలోనే బకాయి వేతనాలను చెల్లిస్తామనీ, డీటీడీఓ ద్వారా వేతనాలు చెల్లించే విధంగా సబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాలడుగు సుధాకర్, తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలల హాస్టల్స్ డైటీవేజ్,ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు టేకం ప్రభాకర్, వర్కింగ్ ప్రసిడెంట్ సురేందర్, జి రాములు,పాయం ముత్తయ్య ,ంగ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.