Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈ గడ్డపై పుట్టి, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్రస్థానానికి ఎదిగి, తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటిచెప్పిన గొప్ప నటుడు, కరీంనగర్ బిడ్డ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం ఆయన 113వ జయంతి సందర్భంగా సీఎం ఆయనకు ఘననివాళులర్పించారు. జాతీయ చలన చిత్ర పరిశ్రమకు పైడి జైరాజ్ అందించిన సేవలను స్మరించుకున్నారు. భారతీయ సినిమా చరిత్రలో మూకీల నుంచి టాకీల వరకు ఆయన ప్రస్థానం సాగిందని గుర్తు చేశారు. భారతీయ వెండి తెరపై మొట్ట మొదటి 'యాక్షన్ హీరో' పైడి జైరాజ్ కావడం తెలంగాణకు గర్వ కారణమని పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఇంకా వేళ్లూనుకోని ప్రారంభ దశనాటికే, బాలీవుడ్లో ఆయన అగ్ర హీరోగా రాణించడం గొప్పవిషయమని తెలిపారు. తనదైన నటనాకౌశలంతోపాటు దర్శకునిగా, నిర్మాతగా రాణించి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న తొలి తరం తెలంగాణ సినిమా నటుడు పైడి జైరాజ్ అని వివ రించారు. తెలంగాణ సినిమా రంగా నికి మూల పురుషుడని కొనియాడారు. హిందీలోనే కాకుండా మరాఠీ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, గుజరాతీ, మలయాళం వంటి పలు జాతీయ భాషల్లో దాదాపు 300 చిత్రాలకుపైగా నటించి భారతీయ సినీ పరిశ్రమలో శిఖర సమానుడిగా నిలిచారని సీఎం తెలిపారు.
తెలంగాణ నేలనుంచి దేశం గర్వించ దగ్గస్థాయిలోకి ఎదిగిన గొప్పవారిలో ఆయన ఒకరని పేర్కొన్నారు. ఆయన అందించిన సేవలకు గుర్తుగా, రాష్ట్ర ప్రభుత్వం రవీంద్రభారతిలోని సమావేశ మందిరానికి 'పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్'గా పేరు పెట్టుకుని గౌరవించుకున్నామని వివరించారు. భవిష్యత్తులో తెలంగాణ సినిమా రంగం మరింతగా రాణించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.