Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం కావాలంటూ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని హాకాభవన్లో సోమవారం పత్తి కొనుగోళ్లపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యిందని వివరించారు. ఈ నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో పత్తి సరాసరి దిగుబడి తగ్గినా, జాతీయ, అంతర్జాతీయంగా పత్తికి మంచి ధర లభించే అవకాశముందని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు పత్తి ధర సుమారు రూ.ఎనిమిది వేలుందని పేర్కొన్నారు. అయినా రైతులకు మద్దతుధర రూ.6,380కుపైగా లభించేలా మార్కెటింగ్ శాఖ, సీసీఐ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాబోయేకాలంలో పత్తికి మరింత డిమాండ్ పెరిగే అవకాశమున నేపథ్యంలో రైతులు పత్తి సాగు పెంచే దిశగా అడుగులు వేయాలని సూచించారు. జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు పత్తి కొనుగోళ్లలో సంపూర్ణంగా భాగస్వాములు కావాలని కోరారు. ఇప్పటికే 313 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేయాలని గుర్తించి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని తెలిపారు. 121 వ్యవసాయ మార్కెట్ యార్డులను సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా ప్రతిపాదన చేశామని పేర్కొన్నారు. ఆ కొనుగోలు కేంద్రాల్లో సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ పరికరాలు, తేమ కొలిచే యంత్రాలు ఏర్పాటు చేయాలనీ, అవసరమైన సిబ్బందిని మార్కెటింగ్ శాఖ వెంటనే నియమించాలని మంత్రి ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రం వారానికి ఆరు రోజులు పనిచేసేలా సీసీఐ మేనేజర్లు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. పత్తి కొనుగోళ్లను పరిశీలించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. జిన్నింగ్ మిల్లర్లు అందరు సీసీఐ టెండర్లలో విధిగా పాల్గొంటామంటూ సానుకూలత వ్యక్తం చేశారని పేర్కొన్నారు. పత్తి నాణ్యత పరీక్షించడానికి మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ప్రయోగశాలను నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. దీనివల్ల రాబోయే కాలంలో నాణ్యతపరంగా రైతులకు మంచి ధరతోపాటు జిన్నింగ్ మిల్లులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీసీఐ వద్ద జిన్నింగ్ మిల్లులకున్న సమస్యలను వెంటనే పరిశీలించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు లక్ష్మణుడు, రవికుమార్, సీసీఐ జనరల్ మేనేజర్ అమర్నాథ్రెడ్డి, జాయింట్ డైరెక్టర్ మల్లేశం, బ్రాంచ్ మేనేజర్లు బ్రిజేష్కుమార్, మహేశ్వర్రెడ్డి, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్రెడ్డి, కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.