Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్య శాఖ కార్యదర్శితో టీజీవో నేతల భేటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)ను పటిష్టంగా అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారులు (టీజీవో) సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీతో టీజీవో అధ్యక్షులు వి మమత నేతృత్వంలో ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. నగదు రహిత వైద్యాన్ని అందించేందుకు ఉద్యోగులు, పింఛనర్ల మూలవేతనంలో ఒక శాతం తీసుకోవాలని కోరింది. అన్ని ఆస్పత్రుల్లోనూ ఈహెచ్ఎస్ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ స్పందిస్తూ ప్రభుత్వం వివిధ ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నదని వివరించారు. ఆరోగ్య శాఖ మంత్రితో ఉద్యోగ సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ, సహాధ్యక్షులు ఎస్ సహదేవ్, ఉపాధ్యక్షులు సుజాత, నగర శాఖ అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎంబీ కృష్ణయాదవ్ పాల్గొన్నారు.