Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెంచుల అభివృద్ధిలో ఆర్డీటీ ఎందుకు?
- చెంచుల సంక్షేమం గాలికి
- పీటీజీ గ్రూపులు ఏమయ్యాయి?
- చెంచు పెంటలు ఖాళీ చేయించడానికే కుట్రలు
- పూర్తయినా సర్వే పనులు
- ఐటీడీఏ పీఓ లేకుండా విధుల నిర్వహణ ఎలా?
నవతెలంగాణ-మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
ప్రభుత్వ రంగ సంక్షేమం ఏదైనా దానికి బాధ్యులు ఉండాలి. ఎప్పటికప్పుడు సమీక్ష చేసి కావల్సిన వనరులను చేకూర్చి పెట్టాలి. ముఖ్యంగా ఆయా రంగాలకు సంబంధించిన లావాదేవీలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. అప్పుడే ఆ రంగం వృద్ధిలోకి వస్తుంది. కానీ చెంచుల అభివృద్ధికోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏకు పీఓ లేకపోవడంతో వారి సంక్షేమం గాలిలో దీపంలా మారింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు కావాల్సిన ప్రైమరీ ట్రైబల్ గ్రూపులను గుర్తించలేదు. నల్లమల నుంచి ఖాళీ చేయించడంలో ఉన్న శ్రద్ధ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఉండటం లేదని పలువురు విమర్శిస్తున్నారు.
మానవ సమాజానికి దూరంగా అత్యంత దయనీయంగా జీవనం సాగిస్తున్న చెంచుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఐటీడీఐ రంగానికి మూడేండ్లుగా పీఓ లేకపోవడంతో జిల్లా కలెక్టరే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో 7500 మంది జనాభాతో 130 అటవీ చెంచు పెంటలు ఉన్నాయి. వీరి సంక్షేమం కోసం రూ.5 కోట్లు కేటాయిస్తే.. దానిలో రూ.2.50కోట్లు ఐటీడీఏకు, మరో రూ.2.50 కోట్లు ఆర్డీటీ ద్వారా ఖర్చు చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున 5 వందల కుటుంబాలకు వంద శాతం సబ్సిడీతో అందజేయనున్నారు. చెంచులకు ఆవులు, గొర్రెలు, గేదెలు, మేకలు, తదితర వాటిని ఇవ్వనున్నారు. పథకాలు సమగ్రంగా చెంచులకు అందాలంటే ప్రత్యేక అధికారి ఉండాలి. అప్పుడే నిజమైన లబ్దిదారులకు ఉపాది లభిస్తోంది. గతంలో చెంచులకు సంబంధించిన జీవనోపాధి కోసం వచ్చిన పథకాలు పక్కదారి పట్టాయనే విమర్శలున్నాయి. వీటిని పర్యవేక్షణ చేయాల్సిన ఐటీడీఏ కనుమరుగవుతోంది. దీనికి పీఓ లేకపోవడంతో పాటు ఉపాధికి సంబంధించిన గ్రూపులను ఏర్పాటు చేయడమూ కారణం. చెంచులకు సంబంధించిన ఏసమస్య వచ్చినా ఐటీడీఏ ముందు ఉండి పరిష్కారం చేసేది. ఇప్పుడా పరిస్థితి లేదు. గతంలో దాతలు ఎవరైనా వచ్చి చెంచులకు సహకారం ఇస్తే.. ఐటీడీఏ నిర్వహణ చేసేది. ఐటీడీఏకు పూర్తి స్థాయిలో అధికారి లేకపోవడంతో చెంచులకు సంక్షేమ పథకాలు అందడం లేదు. అందుకే పథకాలు అమలు సక్రమంగా అందాలంటే ఐటీడీఏకు పూర్తి స్థాయిలో అధికారి ఉండేలా చర్యలు తీసుకోవాలని పలు పార్టీలు, ప్రజాసంఘాలు కోరారు.
ఐటీడీఏను బలోపేతం చేయాలి - శంకర్నాయక్, గిరిజన సంఘం జిల్లా నాయకులు
నల్లమల చెంచులను అభివృద్ధి చేయడానికి ఐటీడీఏను బలోపేతం చేయాల్సిన అవసరముంది. ముఖ్యంగా ఈ రంగానికి పీఓ లేకపోవడం దారుణం. ఇప్పటికైనా ప్రత్యేక అధికారి ఏర్పాటు చేసి అధిక నిధులు కేటాయించాలి. చెంచులను అడవి నుంచి బయటకు తరలించేందుకు చేసే ప్రయత్నాలను నిలిపివేయాలి. ఇప్పటికైనా ప్రభుత్యం వెంటనే స్పందించి చెంచులకు అటవీ ప్రాంతంలో మౌళిక వసతులు కల్పించాలి. లేనిచో ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పక తప్పదు.